నాలుగున్నర నెలలకు కేసు
ABN , First Publish Date - 2022-04-25T04:49:21+05:30 IST
మంత్రాలయం పాతవీధిలో పూజారి వెంకటేశాచార్ ఇంట్లో చోరీ జరిగిన నాలుగున్నర నెలలకు కేసు నమోదైంది. ఎస్పీ నిర్వహించే స్పందనకు ఆరుసార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది.
దొంగతనంపై స్పందనలో పలుమార్లు ఫిర్యాదు
చేసేదిలేక కేసు నమోదు
మంత్రాలయం, ఏప్రిల్ 24: మంత్రాలయం పాతవీధిలో పూజారి వెంకటేశాచార్ ఇంట్లో చోరీ జరిగిన నాలుగున్నర నెలలకు కేసు నమోదైంది. ఎస్పీ నిర్వహించే స్పందనకు ఆరుసార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. చివరికి మంత్రాలయం పోలీసులు కేసు నమోదు చేశారు. గత డిసెంబర్ 6న వెంకటేష్ ఆచార్, ఆయన అక్క భగీరథి ఇంటి తలుపులు పగులకొట్టి దొంగలు ప్రవేశించి రూ.50వేల నగదు, 2 తులాల బంగారు చైన్, రెండు ఉంగరాలు, వెండి వస్తువులు డాక్యుమెంట్ల జిరాక్స్ పత్రాలను ఎత్తుకెళ్లారు. తమ అక్క సీతమ్మ అదృశ్యంపై బెంగుళూరు వెళ్లిన సమయంలో ఈ చోరి జరిగిందని, ఈ విషయం తెలియగానే బెంగుళూరు నుంచి మంత్రాలయం పోలీసులకు సమాచారం ఇచ్చామని వారు తెలిపారు. సీఐ భాస్కర్, ఎస్ఐ వేణుగోపాల్రాజు, హెడ్ కానిస్టేబుల్ క్రిష్ణయ్య తమ ఇంటిని పరిశీలించి క్లూజ్ టీమ్తో వేలిముద్రలు సైతం సేకరించారని తెలిపారు. అప్పట్లో పోలీ్సస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు కూడా చేశామని వారు అంటున్నారు. దీంతో వారు బెంగుళూరు నుంచి వచ్చేంత వరకు పోలీసులు ఇంటికి కాపలా పెట్టి, వారు వచ్చాక అపహరణకు గురైన వస్తువుల వివరాలు తెలుసుకొని నమోదు చేసుకున్నారు. అయితే పోలీసులు చోరీ కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. దీంతో బాధితులు జనవరి 8న, ఫిబ్రవరి 14న, మార్చి 14న, ఏప్రీల్ 22న ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి స్పందనలో ఫిర్యాదు చేశారు. అక్కడ పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఐ భాస్కర్ బాధితులను పిలిపించి ఈ నెల 23న క్రైం.నెం.29/2022 ఐపీసీ 457, 380 కింద కేసు నమోదు చేశారు. కాగా ఎస్పీ ఆదేశాల మేరకే కేసు నమోదు చేశామని సీఐ భాస్కర్ తెలపారు. ఎట్టకేలకు దొంగలు పడ్డ నాలుగున్నర నెలలకు కేసు నమోదైంది.