శైలపుత్రిగా భ్రామరి

ABN , First Publish Date - 2022-09-27T05:01:13+05:30 IST

శ్రీశైలం మహా క్షేత్రంలో సోమవారం దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

శైలపుత్రిగా భ్రామరి
శైలపుత్రి అలంకరణలో అమ్మవారు

భృంగివాహనంపై స్వామి, అమ్మవార్లు
శ్రీగిరిపై శరన్నవరాత్రులు ప్రారంభం


శ్రీశైలం, సెప్టెంబరు 26:
శ్రీశైలం మహా క్షేత్రంలో సోమవారం దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలు అక్టోబరు 5 వరకు జరగనున్నాయి. ఉదయం 8.30 గంటలకు అమ్మవారు ఆలయ మండపంలోని యాగశాల ప్రవేశంతో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం గణపతిపూజ, దీక్షాసంకల్పం, కంకణపూజ, కంకణధారణ, రుత్విగ్వరణం, చండీకలశ స్థాపన, శ్రీచక్రార్చన చేశారు. స్వామి వారి యాగశాలప్రవేశం, గణపతిపూజ, శివసంకల్పం,  రుద్రాభిషేకం నిర్వహించారు. కుమారి పూజలలో రెండేళ్ల నుంచి పది సంవత్సరాలలోపు బాలికలకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలు అందించారు. దేవస్థానం ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

 శైలపుత్రిగా  భ్రమరాంబిక... భృంగివాహనంపై విహరించిన స్వామి, అమ్మవార్లు

దసరా ఉత్సవాల్లో  మొదటిరోజైన సోమవారం అమ్మవారు శైలపుత్రి అలంకారంతో ద్విభుజాలతో, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో పద్మం ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలిగి సర్వత్రా విజయం చేకూరుతుందని నమ్మకం. అనంతరం భృంగి వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులను జేసి సుగంధ పుష్పాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.

 నేడు బ్రహ్మచారిణిగా  ...

దసరా మహోత్సవాల్లో రెండో  రోజు మంగళవారం భ్రమరాంబికా అమ్మవారు బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం స్వామి, అమ్మ వార్లకు మయూర వాహన సేవ నిర్వహించనున్నారు.

Updated Date - 2022-09-27T05:01:13+05:30 IST