ధరల స్థిరీకరణనిధి ఏదీ?

ABN , First Publish Date - 2022-09-27T04:35:56+05:30 IST

పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో ధర లేనప్పుడు ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకుంటామని చెప్పిన సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట ఏమైందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య ప్రశ్నించారు.

ధరల స్థిరీకరణనిధి ఏదీ?
తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న రైతుసంఘం నాయకులు

  1. ఉల్లి రైతులను ఆదుకోవాలి 
  2. ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య 


పత్తికొండ టౌన్‌, సెప్టెంబరు 26: పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో ధర లేనప్పుడు ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకుంటామని చెప్పిన సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట ఏమైందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య ప్రశ్నించారు. ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక సీఆర్‌ భవన్‌ నుంచి ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. నాలుగు స్తంభాల కూడలికి చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రతి ఏటా రైతులు అప్పోసప్పో చేసి పంటలను సాగు చేస్తున్నారని, పంటలు చేతికి వచ్చే సరికి ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్‌లో వేలాది ఎకరాల్లో రైతులు ఉల్లి సాగు చేశారని, మార్కెట్‌లో ధర లేకపోవడంతో పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారన్నారు. క్వింటా రూ.4వేలు ప్రకారంగా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉల్లి రైతులను ఆదుకునేంత వరకు దశల వారి పోరాటాలు సాగిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌ విష్ణుప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజాసాహెబ్‌, నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కారన్న, వీరన్న, సీపీఐ తుగ్గలి మండల కార్యదర్శి సుల్తాన్‌, పట్టణ కార్యదర్శి రామాంజినేయులు, ప్రజా సంఘాల నాయకులు గురుదాసు, నెట్టికంటయ్య, రంగన్న, మునిస్వామి, బొజ్జప్ప పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-09-27T04:35:56+05:30 IST