రైతులకు పరిహారం అందించాలి
ABN , First Publish Date - 2022-12-09T23:46:34+05:30 IST
నకిలీ విత్తనాలు, అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 9: నకిలీ విత్తనాలు, అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ముందు ఽధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీలపై ఇప్పటి వరకు కనీస చర్యలు కూడా తీసుకోకపోవడం దారుణమన్నారు. 70 శాతం పత్తి పంట నకిలీ విత్తనాల వల్లే దెబ్బతిందని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం పత్తి రేటు ఎక్కువగా ఉండటం వల్ల రైతులందరూ పత్తిని సాగు చేశారని తెలిపారు. అధికారులు నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన యజమానులకు మద్దతుగా మాట్లాడడం తగదని స్పష్టం చేశారు. పత్తి, వేరుశనగ పంటల మాదిరి మిగిలిన పంటలకు కూడా వాతావరణ బీమా పథకాన్ని మండలం యూనిట్గా కాకుండా గ్రామం యూనిట్గా పరిగణనలోకి అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతు సంఘం ప్రతినిధులు డీఆర్వో కార్యాలయంలోని ఏవో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆంజినేయులు, ఓర్వకల్లు రైతు సంఘం సహాయ కార్యదర్శి మధుసూదన్, కల్లూరు మండల రైతు సంఘం ప్రతినిధులు మహేష్ పాల్గొన్నారు.