Kurnool: గడప గడపలో షాక్.. వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్...!
ABN , First Publish Date - 2022-08-24T22:19:02+05:30 IST
అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎదురుగాలి వీస్తోందట. గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్రెడ్డి ..
కర్నూలు (Kurnool): అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎదురుగాలి వీస్తోందట. గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్రెడ్డి (Adhoni Mla Sai Prasad Reddy), కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ (Kodumuru Mla Doctor Sudhakar)కు చుక్కెదురు అయిందట. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించగా జనం నుంచి వచ్చే స్పందన చూసి సదరు నేతలు కంగుతిన్నారట.
ఇటీవల ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదోనిలోని 17వ వార్డులో గడపగడపకు కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఓ వృద్ధురాలి దగ్గరకు వెళ్లి సంక్షేమ పథకాల గురించి చెప్పారు. ఆ తర్వాత ఓటు ఎవరికి వేస్తావని వృద్ధురాలిని అడగ్గా.. చంద్రబాబుకు వేస్తానని చెప్పడంతో ఎమ్మెల్యే షాక్ గురయ్యారట. అక్కడ నుంచి మెల్లగా వెళ్లిపోయారట. ఇక పెద్దావిడ చంద్రబాబు (Chandrababu)కు ఓటెస్తానని నేరుగా ఎమ్మెల్యేకు చెప్పిన మాటలు ఆదోని పాలిటిక్స్లో హాట్టాపిక్గా మారాయి.
మరోవైపు ఎమ్మెల్యే సుధాకర్ కోడుమూరులో గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ ఓ వైసీపీ కార్యకర్త తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట. ఎన్నికల కోసం పదివేలు సొంతంగా ఖర్చు చేశానని.. ఇంతవరకూ ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందలేదని నిలదీశారట. బతుకు దెరువు కోసం కారు నడుపుతుంటే రేషన్ కార్డు తీసేశారని మండిపడ్డారట. ఫలితంగా అమ్మ ఒడి కూడా రావడం లేదని... ముగ్గురు పిల్లలను ఎలా చదివించుకోవాలని ప్రశ్నించారట. ఎన్నికల ముందు అందరికీ సంక్షేమ పథకాలని చెప్పి అధికారంలోకి వచ్చాక కొత్త కొత్త రూల్స్తో స్కీమ్స్ కట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ క్రమంలో వైసీపీ లాగా చంద్రబాబు ఎన్నికల ముందు ఒకమాట.. తర్వాత ఒకమాట చెప్పలేదని చెప్పడంతో ఎమ్మెల్యే సుధాకర్ అవాక్కయ్యారట.
ఇలా గడపగడపకు కార్యక్రమంలో జనం నుంచి వచ్చే రియాక్షన్స్ వైసీపీ (Ycp) ఎమ్మెల్యేలకు తలపోటుగా మారాయట. అయితే చంద్రబాబుకు ఓటేస్తామని.. ఆయన పాలనే బాగుందని వైసీపీ కార్యకర్తలే చెప్తుండడంతో ఎమ్మెల్యేలు అయోమయానికి గురవుతున్నారట. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకెన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందోనని ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొందట. ఇదే ఫీవర్ కర్నూలు జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలను సైతం పట్టుకుంటుందట. మొత్తం మీద అధికార పార్టీ ఎమ్మెల్యేల ఎదుటే వైసీపీ కార్యకర్తలు చంద్రబాబును పొగడడంపై కర్నూలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.