గుండె జబ్బు ప్రపంచంలోనే అతిపెద్ద కిల్లర్: AP Governor
ABN , First Publish Date - 2022-05-29T21:31:26+05:30 IST
గుండె జబ్బు ప్రపంచంలోనే అతిపెద్ద కిల్లర్ అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
Vijayawada: ప్రపంచంలో ప్రతి సంవత్సరం 90 లక్షల మంది మరణాలకు కారణమయ్యే గుండె జబ్బు ప్రపంచంలోనే అతిపెద్ద కిల్లర్ అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Harichandan) అన్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన రమేష్ హాస్పిటల్స్ (Ramesh Hospitals) “కార్డియాలజీ అప్డేట్ సమ్మిట్”లో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలో దాదాపు 5.5 కోట్ల మంది ప్రజలు కొన్ని రకాల గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఆరవ వంతు భారత్లోనే ఉన్నారని, ప్రతి పది మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. సరైన విధానాలు, పారిశుద్ధ్య పరిస్థితులు లేకపోవడం ఆందోళనకరమన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని వారి కంటే పట్టణాల్లో ఉండేవారు ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని "కార్డియాలజీ అప్డేట్ సమ్మిట్" వంటి సమావేశాలు కుటుంబ వైద్యుల వ్యవస్థను పటిష్టం చేస్తాయని గవర్నర్ అన్నారు.