వ్యాక్సినేషన్ను వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2022-01-04T05:26:36+05:30 IST
వ్యాక్సినేషన్ను వేగవంతం చేయండి
కలెక్టర్ నివాస్తో మంత్రి పేర్ని నాని చర్చలు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : యువత కరోనా బారిన పడకుండా కొవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేశామని మంత్రి పేర్ని నాని అన్నారు. బందరులోని కలెక్టర్ చాంబరుకు సోమవారం మంత్రి పేర్ని నాని వచ్చారు. ఇరువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకాలు వేయడంలో నూరుశాతం ఫలితాలు సాధించామన్నారు. ఇందుకు కలెక్టర్ నివాస్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన తీరును మెచ్చుకోవాలన్నారు. సోమవారం నుంచి 15-18 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ వేసే ప్రక్రియను ప్రారంభించామన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
మూడు రోజుల్లో పూర్తిచేస్తాం.. : కలెక్టర్
ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ 15-18 ఏళ్ల వయస్సు ఉన్న వారికి కోవాగ్జిన్ వేసే ప్రక్రియను సోమవారం ప్రారంభించామని, జూనియర్ , డి గ్రీ కళాశాలలు, పాఠశాలలు, సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్ను వేస్తున్నామన్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18,973 మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు. వ్యాక్సిన్ కొరత లేదని, మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. యువతకు వ్యాక్సిన్ వేయించడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరారు.
గృహ నిర్మాణంలో వేగం పెంచండి
జిల్లాలో పక్కా గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ నివాస్ అధికారులకు సూచించారు. ‘స్పందన’లో భాగంగా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం జేసీలు కె.మాధవీలత, ఎల్.శివశంకర్, నూపూర్ అజయ్కుమార్, కె.మోహన్కుమార్, డీఆర్వో వెంకటేశ్వర్లుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ ఇంకా పక్కా గృహాల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి పనులు ప్రారంభించేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. గ్రామాల సందర్శనలో భాగంగా ప్రత్యేకాధికారులు పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయాలన్నారు. జేసీ శివశంకర్ మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.