వీధుల్లో జోలె పట్టి..!! రహదారి మరమ్మతులు చేపట్టి..!!
ABN , First Publish Date - 2022-03-16T06:23:36+05:30 IST
గుడివాడ-విజయవాడ (కంకిపాడు రోడ్) మరమ్మతులకు తెలుగు మహిళా నాయకులు గుడివాడ పురవీధుల్లో కొట్టు కొట్టుకు తిరిగి జోలె పట్టారు.
తెలుగు మహిళల వినూత్న నిరసన
మంత్రి కొడాలి నానిపై మహిళా నేతల ఆగ్రహం
గుడివాడ టౌన్ : గుడివాడ-విజయవాడ (కంకిపాడు రోడ్) మరమ్మతులకు తెలుగు మహిళా నాయకులు గుడివాడ పురవీధుల్లో కొట్టు కొట్టుకు తిరిగి జోలె పట్టారు. భారీ గోతులతో విజయవాడ రోడ్డులో నిత్యం ప్రమాదాలు జరిగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నా..నెలరోజుల్లో ప్రమాదాలకు గురై ఆరుగురు మృతి చెందినా పాలకులకు ఏ మాత్రం పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రి కొడాలి నానికి సిగ్గు వచ్చేలా.. మన రోడ్లు మనమే కాపాడుకుందాం - కుటుంబాలు వీధిన పడకుండా కంకణం కట్టుకుందాం’’ అంటూ నినాదాలతో ఇసుక, కంకరు తెచ్చి గుడివాడ-విజయవాడ రోడ్డులోని గుంటలను పూడ్చారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, తెలుగు మహిళలు గొర్ల శ్రీలక్ష్మి, తులసీరాణి, శొంఠి సత్యవతి, నిమ్మగడ్డ సత్యసాయి, చల్లగుళ్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు, రామకృష్ణ, షేక్ సర్కార్, ముళ్లపూడి రమే్షచౌదరి, జోగి షరీఫ్, పెద్దు వీరభద్రరావు, ఎం.బ్రహ్మయ్య పాల్గొన్నారు.