ఏఈని హైకోర్టులో హాజరుపర్చండి
ABN , First Publish Date - 2022-09-17T07:04:20+05:30 IST
ఏఈని హైకోర్టులో హాజరుపర్చండి
గన్నవరం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కె.సుజాతపై హైకోర్టు ఆగ్రహం ..వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన ధర్మాసనం.. తెంపల్లి పైపులైన్ల పనుల టెండర్ల రద్దుపై కౌంటర్ వేయాలని కృష్ణాజిల్లా అధికారులకు నిర్దేశం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): తెంపల్లిలో కలుషిత నీటి నివా రణకు పిలిచిన పైపులైన్ల టెండర్ల రద్దు అంశంపై గన్నవరం ఏఈ కె.సుజాతను కోర్టు ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. టెండర్ల రద్దుపై కౌంటర్ వేయాలని కృష్ణాజిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికా రులకు హైకోర్టు నిర్దేశించింది. గన్నవరం మండలం తెంపల్లిలో కలు షిత నీటి కారణంగా ప్రాణాంతక క్లెబ్సియల్లా వైరస్తో నలుగురు మృతి చెందడం, వందకు పైగా బాధితులు కావడం తెలిసిందే. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మంచినీటి పరీక్షలను చేయించకపోవడం, గ్రామంలో వర్షాలు కురిస్తే నీళ్లు నిలిచిపోతాయని తెలిసీ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం, పాతకాలపు పైపులైన్లను సకాలంలో మార్చక పోవడంతో డ్రెయినేజీ నీరు మంచినీటి పైపుల్లోకి చేరి వైరస్ సోకి నలు గురు చనిపోయారు. వంద మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కృష్ణాజిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన తెంపల్లిలో మంచినీటి పైపులైన్ల పనులకు శ్రీకారం చుట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధి కారులను నిర్దేశించింది. ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు హెడ్ క్వార్డర్ నుంచి పనులకు టెండర్లు పిలిచారు. టెండర్లలో ఒకరు అనర్హత సాధించగా.. రెండో సంస్థ పీవై కన్స్ట్రక్షన్స్ రిజిస్ర్టార్ ఆఫ్ కంపెనీస్ నుంచి లెటర్ను సబ్మిట్ చేయలేదు. లెటర్ సబ్మిట్ చేయకపోతే టెండర్ తెరవకూడదు. కానీ తెరిచారు. అయినప్పటికీ ఆ సంస్థ అనర్హత సాధించింది. గారపాటి కన్స్ట్రక్షన్స్ టెండర్ను దక్కిం చుకుంది. జిల్లా ఆర్డబ్ల్యూఎస్ కాంపిటెంట్ అథారిటీ స్థాయిలో లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ(ఎల్ఓఏ) ఇచ్చారు. గన్నవరం ఏఈ కాంట్రాక్టు సంస్థకు తగిన సహకారం అందించలేదు. అదే రోజున ఆమె కాంట్రాక్టు సంస్థపై ఆరోపణలు చేస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దీంతో ప్రతిష్టంభన ఏర్పడి, పనుల్లో జాప్యం జరిగింది. జిల్లా యంత్రాంగ సమీక్షల్లో వేరే సంస్థ ద్వారా చేయించాలని ప్రతిపాదించటం వివాదా స్పదమైంది. జాప్యంపై కాంట్రాక్టు సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో విచారణలో ఉండగానే.. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కాంట్రక్టు సంస్థ టెండర్ను రద్దు చేశారు. దీంతో కాంట్రాక్టు సంస్థ కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. విచారించిన హైకోర్టు ధర్మాసనం గన్నవరం ఏఈ సుజాతను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. సీసీఏ రూల్స్కు భిన్నంగా ఉన్నతస్థాయి కాంపిటేట్ అథారిటీ సమక్షంలో జరి గిన టెండర్లపై ఏఈగా కాంట్రాక్టు సంస్థపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాయ టాన్ని కోర్టు తప్పుపట్టినట్టుగా తెలుస్తోంది. ఏఈ చర్యవల్ల యుద ్ధప్రాతిపదికన చేపట్టాల్సిన పైపులైన్ల పనులు ఆగిపోవటం ప్రజలకు మంచిది కాదన్న భావనలో హైకోర్టు ధర్మాసనం ఉన్నట్టు తెలుస్తోంది. ఏఈని వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా నిర్దేశించటం వల్ల కోర్టు ఈ కేసును తీవ్రంగా పరిగణించినట్టుగా తెలుస్తోంది. కోర్టు ధిక్కరణ పిటిష న్ కావటంతో.. హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా పరిగణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు టెండర్ల రద్దుపై కౌంటర్ వేయాలని సూచించడం వ్యవహారం తీవ్రతను తెలియజేస్తోంది.