అలరించిన అందెల రవళి
ABN , First Publish Date - 2022-03-16T06:18:23+05:30 IST
భరతముని నాట్యోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం సిద్ధేంద్ర కళావేదికపై ప్రదర్శించిన పలు నాట్యాంశాలు ఆద్యంతం అలరించాయి.
కూచిపూడి, మార్చి 15 : భరతముని నాట్యోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం సిద్ధేంద్ర కళావేదికపై ప్రదర్శించిన పలు నాట్యాంశాలు ఆద్యంతం అలరించాయి. తొలుత పిఎం.షోహైల్ ఖాన్ ధనశ్రీ థిల్లానా అం శాన్ని ప్రదర్శించి నాట్యాంశాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం డాక్టర్ బిందు అభినయ శిషులు కీర్తన, అపూర్వ, గాయత్రి, లక్ష్మిప్రసన్న పలు అంశాలు ప్రదర్శిం చి నాట్యాంశాలకు వన్నె తెచ్చారు. బిజన సురేంద్రనాఽథ్ బృంద సభ్యులు మోహినీ యాట్టంలో గణేష స్తుతి, అష్టలక్ష్మీ స్తోత్రం అంశాలను ప్రదర్శించి కళలకు భాషాబేధం లేదని చాటి చెప్పారు. పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమీ బృంద సభ్యులు లక్ష్మికామేశ్వరీ, అనిష్, కుమారదత్త, చక్రవర్తి, విజయ్, కావ్య, రేహరజన్, స్వప్న, రేణుభార్గవి పలు కూచిపూడి అంశా లు ప్రదర్శించి రసజ్ఞులైన ప్రేక్షకులను రంజింపచేశారు. చివరగా చింతా రవి బాలకృష్ణ నిర్వహణలో ఉషాపరిణయం కూచిపూడి యక్షగానాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ముంచెత్తారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి టి.కిషన్రావు, కంచి కామకోటి విశ్వవిద్యాలయ చాన్స్లర్ జయరామిరెడ్డి, సీసీఆర్టీ ప్రత్యేకాధికారి తాడేపల్లి సత్యనారాయణ శర్మ, పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం సిద్ధేంద్ర కళాపీఠం ప్రిన్సిపాల్ వేదాంతం రామలింగశాస్త్రి, నాట్యాచార్యులు పసుమర్తి రత్తయ్య శర్మ, వేదాంతం రాధేశ్యామ్, పసుమర్తి వెంకటేశ్వర శర్మ తదితరులు జ్యోతి ప్రకాశనం చేసి సభా కార్యక్రమాలను ప్రారంభించారు. తిథులు మాట్లాడుతూ కూచిపూడిని మరింత విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కళాకారులను నిర్వాహకులు మెమోంటోలు అందించి ఘనంగా సత్కరించారు.