జూన్ నాటికి అందుబాటులో బెల్ కంపెనీ
ABN , First Publish Date - 2022-09-13T06:44:55+05:30 IST
జూన్ నాటికి అందుబాటులో బెల్ కంపెనీ
- కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్
పామర్రు, సెప్టెంబరు 12 : వచ్చే జూన్ నాటికి నిమ్మలూరు తుది దశ నిర్మాణంలో ఉన్న బెల్ కంపెనీని వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. నిమ్మలూరులో రూ.340 కోట్ల నిధులతో 50ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణపనులు పూర్తిచేసుకుంటున్న భారత్ ఎలక్ర్టానిక్స్ సంస్థ (బెల్) పరిశ్రమ విస్తరణ పనులను సోమవారం జిల్లా పర్యాటనలో ఉన్న కేంద్రమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా బెల్ కంపెనీ ఉన్నతస్థాయి ఉద్యోగులు ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆమె తిలకించడంతోపాటు కర్మాగారంలో తయారుచేసే పరికరాలు దేశ రక్షణ, పారామిలిటరీ బలగాలకు విధి నిర్వహణలో ఎలా ఉపయోగిస్తారో కంపెనీ జీఎం ప్రభాకర్, మంత్రికి వివరించారు. నైట్ విజన్ టెలిస్కోపిపరికరాలను ఆమె పరిశీలించారు. ఎలక్ర్టో ఆప్టిక్ వ్యాపార విస్తరణకు నిమ్మలూరు కంపెనీ దోహదపడనుందన్నారు. 2016లో అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడులు కలిసి శంకుస్థాపన చేసినట్టు ఆమె దృష్టికి తెచ్చారు. తొలుత పరిశ్రమ ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో ఊయ్యూరు ఆర్డీవో ఎన్.విజయకుమార్, ఎంపీడీవో వైరామకృష్ణ, సీఐ ఎన్.వెంకటనారాయణ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.