AP News: దక్షిణ అండమాన్లో బలపడిన అల్పపీడనం
ABN , First Publish Date - 2022-12-06T12:48:06+05:30 IST
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్లో అల్పపీడనం బలపడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్లో అల్పపీడనం బలపడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఐఎండి (IMD) వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఇది క్రమంగా బలపడి ఎల్లుండి ఉదయానికి తుఫానుగా మారే అవకాశముందని పేర్కొంది. ఉత్తర తమిళనాడు - పుదుచ్చేరి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి అధికారులు సూచనలు జారీ చేశారు. దక్షిణకోస్తాంధ్ర -తమిళనాడు తీరాల వెంబడి శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.