మీ సంగతి తేలుస్తా..!
ABN , First Publish Date - 2022-12-30T00:54:34+05:30 IST
ఫ్రీ బస్పా్సల జారీకోసం అనధికారిక వసూళ్లు, సిబ్బంది నుంచి మామూళ్లు, ఇంటికి చికెన్, మటన్, సిగరెట్లు, మందుబాటిళ్లతో పాటు వస్తువులను కూడా బలవంతంగా కొనిపించి తీసుకోవటం వంటి వాటిపై విద్యాధరపురం డిపోలోని సిబ్బంది అందరినీ విజిలెన్స్ బృందాలు విచారించాయి.
విజిలెన్స్కు ఆధారాలిచ్చిన ఉద్యోగులకు వేధింపులు
అక్రమాలు వాస్తవమేనని గుర్తించిన విజిలెన్స్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఫ్రీ బస్పా్సల జారీకోసం అనధికారిక వసూళ్లు, సిబ్బంది నుంచి మామూళ్లు, ఇంటికి చికెన్, మటన్, సిగరెట్లు, మందుబాటిళ్లతో పాటు వస్తువులను కూడా బలవంతంగా కొనిపించి తీసుకోవటం వంటి వాటిపై విద్యాధరపురం డిపోలోని సిబ్బంది అందరినీ విజిలెన్స్ బృందాలు విచారించాయి. ఏఎంకు లంచాల రూపంలో చెల్లించిన డబ్బుకు సంబంధించిన పేమెంట్ స్ర్కీన్ షాట్స్ను సిబ్బంది అందించారు. డిపో ఏఎం బలవంతం మేరకు కొనుగోలు చేసిన వస్తువుల జాబితాను కూడా చూపారు. ఒక ఉద్యోగి ఏఎంకు కొనిచ్చిన సెల్ఫోన్ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫోన్ బిల్లు తీసుకుని, అది అమ్మిన మొబైల్ షోరూమ్కు వెళ్లి నిర్ధారించుకున్నారు. తీసుకున్న డబ్బుతో పాటు అందుకున్న వస్తువులు, అక్రమ వసూళ్లకు సంబంధించిన అంశాల్లో సాక్ష్యాలు లభించటంతో ఏఎం వెన్నులో వణుకు మొదలైంది. తనపై చర్యలు తప్పవన్న భయంతో ‘మీ సంగతి తేలుస్తా’ అంటూ సిబ్బందిపై విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. తనపై ఫిర్యాదులు చేసిన వారితో పాటు ఆరోపణలు గుప్పించినవారు, అనుమానితులను అందరినీ బంతాట ఆడుతున్నాడు. అక్కసుతో ఇష్టానుసారంగా షెడ్యూల్ డ్యూటీలు మార్చేస్తున్నాడు. రన్నింగ్ కిలోమీటర్లు పెంచటం ద్వారా సిబ్బందిపై ఒత్తిడి పెంచాడు. ఎలా ఉద్యోగం చేస్తారో చూస్తానంటూ హెచ్చరికలు పంపుతున్నట్టు సమాచారం.
ఈడీ సమగ్ర విచారణ జరపాలి
ఏఎంపై చర్యలు తీసుకోవటంలో ఉన్నతాధికారులు తాత్సారం చేస్తున్నారు. విజిలెన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో సమగ్ర నివేదిక ఇచ్చినా.. జోన్ బాస్ మాత్రం దానిని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యాధరపురం డిపో ఏఎం సాగిస్తున్న ధనకార్యాలపై విజిలెన్స్ విచారణనేపథ్యంలో ఆర్టీసీ జోన్ ఈడీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.