దుబాయ్‌కు నేరుగా విమానం

ABN , First Publish Date - 2022-10-02T06:06:01+05:30 IST

దుబాయ్‌కు నేరుగా విమానం

దుబాయ్‌కు నేరుగా విమానం
ఎయిర్‌పోర్టు అడ్వైజరీ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న బాలశౌరి

గన్నవరం(ఉంగుటూరు), అక్టోబరు 1: విజయవాడ నుంచి దుబాయ్‌కు డైరెక్ట్‌ విమానం ఈనెల 29 నుంచి ప్రారంభమవుతుందని, వారానికి రెండు రోజులు నడుస్తుందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో శనివారం ఎయిర్‌పోర్ట్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో విజయవాడ నుంచి ముంబయ్‌, వారాణసీకి రాకపోకలు సాగించే విమానాలను పునరుద్ధరణ చేయాలని, ఢిల్లీకి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున మరొక విమానాన్ని అదనంగా నడపాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం డ్యూటీఫ్రీ షాపులను ప్రారంభించాలని, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఫారెక్స్‌ కౌంటర్‌ ఏర్పాటుచేయాలని సూచించారు. గత సమావేశంలో నూతన టెర్మినల్‌ భవన నిర్మాణ పనులు 21శాతం పూర్తయితే గడచిన ఆరునెలల్లో కేవలం 10శాతం పనులే పూర్తికావడంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్ట్‌ మేనేజర్‌, కాంట్రాక్టర్‌ త్వరితగతిన పనులు పూర్తిచేయాలని సూచించారు. జూలై నాటికి టెర్మినల్‌ పనులన్నీ పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ఫ్రీవైఫై సదుపాయంపై ప్రయాణికులకు తెలిసేలా మైక్‌ అనౌన్స్‌మెంట్‌ చేయాలని, సైన్‌బోర్డులు ఏర్పాటుచేయాలని ఎంపీ ఆదేశించారు. ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌ సంస్థలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉబర్‌, వోలా వంటి సంస్థల వాహనాలను విమానాశ్రయ పరిధిలోకి ప్రవేశించటానికి అనుమతించాలని, 5నిమిషాలు ఆలస్యమైనా ప్రయాణికులను విమానంలోకి అనుమతించాలని సూచించారు. విమానాశ్రయం పరిధిలో రూ.కోటి ఖర్చుతో కమ్యూనిటీహాలు నిర్మిస్తామని తెలిపారు. కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా, ఎస్పీ పి.జాషువా, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2022-10-02T06:06:01+05:30 IST