మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2022-02-19T06:35:12+05:30 IST

మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి: దేవినేని ఉమా

మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి: దేవినేని ఉమా
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దేవినేని ఉమా

మైలవరం, ఫిబ్రవరి 18: ఆరు మండలాలకు కేంద్రంగా ఉన్న మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే వసంతకు నియోజకవర్గంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్ల ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ రెవెన్యూ డివిజన్‌ సాధనపై లేదని ఉమా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కి నేడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తోందన్నారు. ఎమ్మెల్యే అభివృద్ధిని పక్కన పెట్టి మండలానికి ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పెడుతూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని విమర్శించారు. బినామీ బామర్దిని అడ్డం పెట్టుకుని నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారన్నారు. తన హయాంలో ఏ పని చేశానో కరపత్రాలు ప్రతి ఇంట్లో ఉన్నాయని, 33 నెలల్లో వసంత ఏమి చేశారో, ఆర్డీవో కార్యాలయాన్ని ఎందుకు తాకట్టు పెట్టారో చెప్పాలని ఉమా ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కలిసి ఆర్డీవో కార్యాలయాన్ని మైలవరంలో ఏర్పాటు చేయాలని అడిగిన వినతిపత్రాన్ని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కృష్ణాజలాలను పేదవారికి అందకుండా బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు మరల్చడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రూ.2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్‌ క్యాలెండర్‌ ఊసు ఎత్తకుండా, నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టింగ్‌లు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ధాన్యం రైతులకు ఇంకా కొన్ని గ్రామాల్లో డబ్బులు జమకాలేదని, మామిడి తోటల్లో పూత రాలుతుంటే ఏ శాస్త్రవేత్త అయినా వచ్చి కాపాడటానికి చర్యలు తీసుకున్నారా? అని నిలదీశారు. రాష్ట్రంలో వ్యవసాయ విభాగం పని చేస్తుందా అని ప్రశ్నించారు.  రెవెన్యూ డివిజన్‌ ప్రకటించకుంటే టీడీపీ ఆధ్వర్యంలో వచ్చే వారంలో నిరసన దీక్షలు చేస్తామని హెచ్చరించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకొనొ పోరాటాలు చేపట్టి ప్రభుత్వ మెడలు వంచి డివిజన్‌ను సాధిస్తామని హెచ్చరించారు. రెవెన్యూ డివిజన్‌పై ఎమ్మెల్యే వసంత తక్షణమే స్పందించాలని ఉమా డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు, పార్టీ మండల అధ్యక్షుడు తాతా పోతురాజు, పట్టణ అధ్యక్షుడు మల్లెల రాధాకృష్ణ, కార్యదర్శి దూరు బాలకృష్ణ, గంజి రామకృష్ణారెడ్డి, లంక లితీష్‌, మలెల్ల దుర్గారావు, కరీందాదా, మధు, వెంకటనారాయణ, అంజి, బీటీఎస్‌ శ్రీను, బాబూరావు, భార్గవ్‌, కరీముల్లా, దాధర్‌, షరీఫ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-02-19T06:35:12+05:30 IST