టీడీపీతోనే బీసీలకు న్యాయం
ABN , First Publish Date - 2022-09-21T05:57:36+05:30 IST
తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి బీసీలు తెలుగుదేశంతోనే ఉన్నారని, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం టీడీపీతోనే సాధ్యం అయిందని టీడీపీ నాయకులు కొల్లు రవీంద్ర అన్నారు.
మాజీమంత్రి కొల్లు రవీంద్ర
నేడు విజయవాడలో కమిటీల ప్రమాణస్వీకారం
చంద్రబాబు రాక
లబ్బీపేట, సెప్టెంబరు 20 : తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి బీసీలు తెలుగుదేశంతోనే ఉన్నారని, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం టీడీపీతోనే సాధ్యం అయిందని టీడీపీ నాయకులు కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం ఏ-కన్వెన్షన్లో జరిగే టీడీపీ బీసీ విభాగం ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు వైసీపీ ప్రభుత్వంలో బీసీలు పూర్తిగా అణిచి వేయబడుతున్నారని, దానిపై రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సాధికారిక కమిటీలు అన్ని సామాజిక వర్గాల్లో నియమించినట్టు తెలిపారు. దాదాపు 54 సాధికారిక కమిటీలు, స్టేట్ బీసీ సెల్ కమిటీలు గ్రామస్థాయి నుంచి పార ్లమెంట్ స్థాయి వరకు నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా వివిధ కమిటీలు వేసినట్టు తెలిపారు. ఈ కమిటీల్లో ఉన్న వారందరూ బుధవారం ఏ-కన్వెన్షన్లో జరిగే కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సమక్షంలో, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నాయకత్వంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఇది ఒక్క ప్రమాణ స్వీకారమే కాదని బీసీల్లో చైతన్యం తెచ్చే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలుపై కదంతొక్కే కార్యక్రమాలకు ఇక్కడ నుంచే ప్రారంభించబోతున్నామని తెలిపారు. మంత్రులకు శాఖలపై పట్టులేదని, కేవలం ప్రెస్ మీట్లకు పరిమితం చేసి ప్రతిపక్షాలను తిట్టే పని అప్పగించారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ అగడాలపై ఈ వేదికపై నుంచే కార్యచరణకు పిలుపు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని అందుకు కూడా ఇక్కడ నుంచే కార్యచరణ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విభాగం నాయకులు వీరంకి గురుమూర్తి, బీసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సత్య పాల్గొన్నారు.
ఉమ్మడి కృష్ణా బీసీ సాధికార సమితి కన్వీనర్ల నియామకం
విజయవాడ : టీడీపీ పార్లమెంట్ బీసీ సాధికార సమితి కన్వీనర్లుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ నుంచి రేవు గోపాల కృష్ణ (అగ్నికుల క్షత్రియ), కొక్కిలిగడ్డ మహేష్(అగ్నికుల క్షత్రియ), ఎస్. శ్రీనివాసరావు(శాలివాహన), పి.శివ కుమార్ (రజక), గంజి నరసయ్య (వడ్డెర), దుర్గారావు (వడ్డెర), శివకోటి రాజేంద్రప్రసాద్ (విశ్వబ్రహ్మణ), తాడిశెట్టి విరాస్వామి (ఉప్పర), కొక్కిలిగడ్డ నాగ రమేష్ (మత్సకార), అవుల రామారావు (యాదవ) సురవరపు నాగరాజు (నాయి బ్రహ్మణ)లను నియమించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.