వ్యాధులు ప్రబలుతున్నా పాలకుల మొద్దునిద్ర
ABN , First Publish Date - 2022-07-18T06:39:02+05:30 IST
ఎమ్మెల్యే వంశీ అసమర్ధత, అధికారుల నిర్లక్ష్యం వల్లనే తెంపల్లిలో డయేరియా విజృంభించిందని ఎమ్మెల్సీ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బచ్చుల అర్జునుడు మండిపడ్డారు.
వ్యాధులు ప్రబలుతున్నా పాలకుల మొద్దునిద్ర
ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
ఉంగుటూరు, జూలై 17 : ఎమ్మెల్యే వంశీ అసమర్ధత, అధికారుల నిర్లక్ష్యం వల్లనే తెంపల్లిలో డయేరియా విజృంభించిందని ఎమ్మెల్సీ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. ఉంగుటూరులో ఆదివారం నిర్వహించిన బాదుడే బాదుడుకు హాజరైన బచ్చులకు టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్జునుడు మాట్లాడుతూ తెంపల్లిలో పారిశుధ్య నిర్వహణా లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అసమర్ధత, అధికారుల అలసత్వం వల్లనే డయేరియా మరణాలు సంభవించాయని, పదులసంఖ్యలో ప్రజలు ఆసుపత్రి పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సీజనల్ అంటువ్యాధులు, విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యేకి చీమకుట్టినట్లైనా లేదని ఆరోపించారు. సూరంపల్లి, కొండపావులూరు లో కొండల్ని తవ్వి మట్టి అమ్ముకోవడంపై వున్న శ్రద్ధ గ్రామాల్లో ప్రజలకవసరమైన మౌలికవసతులు కల్పించే విషయంలో లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కలెక్టర్ పి.రంజిత్బాషా స్పందించి, తక్షణమే తెంపల్లి గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థను బాగుచేయించాలని కోరారు. టీడీపీ నాయకులు ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, ఆళ్ల హానోక్, జాస్తి వెంకటేశ్వరరావు, జూపల్లి సురేష్, కోనేరు సందీప్, తాటిపాముల నాగయ్య, మున్నా రామకృష్ణ, అట్లూరి రామ్కిరణ్, దేవినేని హర్ష, మండవ రమ్యకృష్ణ, ఆళ్ల గోపాలకృష్ణ, అహ్మద్ ఫకీర్, ఈసరి రవికుమార్, జొన్నలగడ్డ సుధాకర్, మండవ అన్వేష్, సందీప్, దుడ్ల కుమార్, కొలుసు రవీంద్ర తోపాటు నియోజకవర్గం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
అసమర్థ పాలనతో అస్తవ్యస్తం : బోడె ప్రసాద్
ఉయ్యూరు : రాష్ట్రప్రభుత్వ అసమర్ధత వల్ల రాష్ట్రంలో ప్రజల జీవితం అస్తవ్యస్తమైందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు. స్థానిక 10, 12 వార్డులో ఆదివారం బాదుడే బాదుడు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయిఉన్నారని బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రజలు తెలియచేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కౌన్సిలర్లు పలియాల శ్రీనివాస రావు, బూరెల రమణ, నరేష్, అప్పలనాయుడు, చిరంజీవి, జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.