తొమ్మిదిమంది దుర్గగుడి సిబ్బందిపై చర్యలు
ABN , First Publish Date - 2022-11-30T00:55:21+05:30 IST
గత ఏడాది దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరిగిన ఏసీబీ దాడుల్లో పట్టుబడిన ఉద్యోగుల్లో తొమ్మిది మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
వన్టౌన్, నవంబరు 29 : గత ఏడాది దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరిగిన ఏసీబీ దాడుల్లో పట్టుబడిన ఉద్యోగుల్లో తొమ్మిది మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. మరో ఆరుగురు ఉద్యోగులకు క్లీన్చిట్ ఇచ్చారు. దేవదాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈవో భ్రమరాంబ ఆయా ఉద్యోగులపై చర్యలు తీసుకుంటూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటివరకు తమకేమీ కాదంటూ ధీమాతో ఉన్న ఉద్యోగులకు షాక్ తగలడం చర్చనీయాంశమైంది. మొత్తం 15 మంది ఉద్యోగులపై ఏసీబీ నివేదిక ఇచ్చింది. వీరిలో అమృతరావు, భాగ్యజ్యోతి, రవి ప్రసాద్, కె.రమేష్, ప్రకాష్, ఏడుకొండలు ఆ సమయంలో విధుల్లో లేకపోవడంతో క్లీన్చిట్ ఇచ్చారు. మిగతా 9 మందిలో మధును రివర్స్ చేసి జూనియర్ అసిస్టెంటుగా పంపారు. మరో ఇద్దరికి రూ.10వేల జరిమానా, మిగతా వారికి ఒక ఇంక్రిమెంట్ కోత పెడుతూ ఉత్తర్వులు ఇచ్చారు.