దుర్గమ్మకూ ‘బ్రేక్‌’లు!

ABN , First Publish Date - 2022-08-31T08:11:13+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలోనూ బ్రేక్‌ దర్శనాలు అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఈ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

దుర్గమ్మకూ ‘బ్రేక్‌’లు!

వీఐపీలకు 5 టైం స్లాట్‌లు కేటాయింపు..

ఒక్కో స్లాట్‌కు 2వేల టికెట్లు ఆన్‌లైన్‌లో

దసరా ఉత్సవాల్లో అమలుకు నిర్ణయం..

మహామండపంలో లిఫ్టులన్నీ వీఐపీలకే

ఘాట్‌రోడ్డు నుంచి దర్శనానికి భక్తులు..

ప్రతి ఎమ్మెల్యేకు ఐదు సిఫారసు లేఖలు

విజయవాడలో ప్రజాప్రతినిధులకు పది..

ఒక లేఖపై ఆరుగురికి మాత్రమే దర్శనం


విజయవాడ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలోనూ బ్రేక్‌ దర్శనాలు అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఈ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే ఉత్సవాలు జరిగే పది రోజుల్లో భక్తులకు అన్నదానానికి స్వస్తి పలికారు. వచ్చేనెల 26నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల ఏర్పాట్ల గురించి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాకు వివరించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే బ్రేక్‌ దర్శనాలపై నిర్ణయం తీసుకున్నామన్నారు. తెల్లవారుజామున 3-5 గంటలు, ఉదయం 6-8 గంటలు, 10-12 గంటలు, మధ్యాహ్నం 2-4 గంటలు, రాత్రి 8-10 గంటల మధ్య మొత్తం ఐదు టైం స్లాట్‌లను వీఐపీల కోసం కేటాయించామన్నారు. వారికి టికెట్‌ రూ.500గా నిర్ణయించామని, ఒక్కో స్లాట్‌కు 2వేల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు.


ఈసారి వీఐపీల రాకపోకలన్నీ ఇంద్రకీలాద్రికి దిగువన ఉన్న కనకదుర్గనగర్‌ నుంచి జరుగుతాయని వెల్లడించారు. మహామండపం వద్ద ఉన్న లిఫ్టుల ద్వారా దేవస్థాన సిబ్బంది వీఐపీలను దర్శనానికి తీసుకెళ్తారన్నారు. బ్రేక్‌ దర్శనాల టికెట్ల విక్రయానికి బయట కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌లో మిగిలిన టికెట్లను మాత్రమే ఈ కౌంటర్లలో విక్రయిస్తారన్నారు. 


అన్నదానం నిలిపివేత..

‘‘ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో అన్నదానం నిలుపుదల చేస్తున్నాం. దానిస్థానంలో చక్రపొంగలి, దద్ధ్యోదనం, పులిహోర ప్లేట్‌లో పెట్టి భక్తులకు అందిస్తాం. రోజుకు 60-70వేల మందికి మాత్రమే అన్నదానం చేసే అవకాశం ఉంది. రోజుకు లక్ష మంది వస్తే... వారందరినీ కూర్చోబెట్టి, ఆకులు వేసి, కూరలు, అన్నం వడ్డించే సామర్థ్యం దేవస్థానం వద్ద లేకపోవడంతోనే అన్నదానం రద్దు చేశాం’’ అని మంత్రి సత్యన్నారాయణ పేర్కొన్నారు. ఈ అంశాన్ని వ్యతిరేక కోణంలో కాకుండా సానుకూల వైఖరితో చూడాలని మీడియాకు సూచించారు. మహామండపంలో ఉన్న లిఫ్టులను మొత్తం వీఐపీలు, వీవీఐపీలకు ఉపయోగిస్తామని చెప్పారు. ఉచిత, రూ.100, రూ.300 భక్తులను ఘాట్‌రోడ్డు నుంచి దర్శనానికి పంపుతామన్నారు.


ఇందుకోసం ఘాట్‌రోడ్లులోని ఓం మలుపు వద్ద ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత దర్శనాలకు రెండు క్యూలు, రూ.100, రూ.300 క్యూతో పాటు మరొక లైను ఉంటుందన్నారు. దర్శనం అనంతరం భక్తులు శివాలయం వైపు ఉన్న మెట్ల మార్గం ద్వారా కిందికి రావాలని మంత్రి సూచించారు. దసరా ఉత్సవాల్లో ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నట్టు మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు రోజుకు ఐదు సిఫారసు లేఖలు ఇవ్వొచ్చన్నారు. విజయవాడలో ఉన్న ప్రజా ప్రతినిధులతో పాటు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జికి పది లేఖలు కేటాయించామన్నారు. ఒక్కో లేఖపై ఆరుగురికి మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు. వారు రూ.500 టికెట్‌ కొనుగోలు చేయాలని చెప్పారు. ఎమ్మెల్యేలు మాత్రం కుటుంబంతో కలసి పది రోజుల్లో ఏదో ఒకరోజున ఉచితంగా దర్శనం చేసుకోవచ్చన్నారు. 

Updated Date - 2022-08-31T08:11:13+05:30 IST