రోడ్డుప్రమాదంలో కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2022-06-08T05:13:35+05:30 IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో వెంకట్రమణ(45)అనే చేనేత కార్మికుడు మృతిచెందగా, మరొకరు తీవ్రం గా గాయపడ్డారు.

రోడ్డుప్రమాదంలో కార్మికుడి మృతి

మదనపల్లె క్రైం, జూన్‌ 7: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో వెంకట్రమణ(45)అనే చేనేత కార్మికుడు  మృతిచెందగా, మరొకరు తీవ్రం గా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. తాలూకా పోలీసుల కథనం మేరకు కర్ణాటక రాష్ట్రం మాదేపల్లెకు చెందిన వెంకట్రమణ  కొద్దిరోజుల కిందట ఉపాధినిమిత్తం కుటుంబంతో కలసి మదనపల్లెకు వలసొచ్చాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మంగళవారం రాత్రి స్నేహితుడు కర్ణాటక రాష్ట్రం రాయల్‌పాడుకు చెందిన రమే్‌షతో కలసి ద్విచక్రవాహనంలో కర్ణాటకకు బయలుదేరాడు. దారిలో మదనపల్లె మండలం చిప్పిలి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్‌ ఇవ్వబోయి అదుపుతప్పి బోల్తాపడ్డారు. ఈ ప్రమాదంలో వెంకట్రమణ అక్కడికక్కడే మృతిచెందగా రమేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఘటనపై తాలూకా పోలీసులకు సమాచారం అందించి రమే్‌షను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించి బాధిత కుటుంబీకులకు సమాచారం అందించారు. వెంకట్రమణ భార్యాపిల్లలు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు.  అనంతరం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి కేసునమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ చెప్పారు.


Updated Date - 2022-06-08T05:13:35+05:30 IST