ఇళ్లు కట్టుకున్నాం.. కరెంటు ఇవ్వండి సార్...
ABN , First Publish Date - 2022-05-24T05:44:01+05:30 IST
అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నాం..ఇప్పుడు చూస్తే కరెంటు లైన్ లాగలేదు..మీరైనా మాపై కనికరించండం సార్ అంటూ మదనపల్లె పట్టణ శివారులోని బీకే పల్లె రెవిన్యూ గ్రామం లబ్ధిదారులు ఆర్డీవో మురళితో మొరపెట్టుకున్నారు.
ఆర్డీవోకు బాధితుల వినతి
మదనపల్లె టౌన్, మే 23: అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నాం..ఇప్పుడు చూస్తే కరెంటు లైన్ లాగలేదు..మీరైనా మాపై కనికరించండం సార్ అంటూ మదనపల్లె పట్టణ శివారులోని బీకే పల్లె రెవిన్యూ గ్రామం లబ్ధిదారులు ఆర్డీవో మురళితో మొరపెట్టుకున్నారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పలువురు సమస్యలపై వినతులు అందజేశారు. బీకే పల్లె కాలనీ వాసులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో 100 ఇళ్లు కట్టుకున్నామని, కరెంటు కనెక్షన్ ఇవ్వలేదన్నారు. దీనిపై హౌసింగ్, ట్రాన్స్కో అధికారులకు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఇంతవరకు స్పందించలేదన్నారు. దీనిపై ఆర్డీవో మురళి మాట్లాడుతూ నవరత్నాల పథకంలో మంజూరైన లేఅవుట్లకు విద్యుత్ సరఫరా వెంటనే ఇవ్వాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు లేఖ రాయాలని హౌసింగ్ డీఈ చంద్రశేఖర్ను ఆదేశించారు. దీంతో పాటు భూ సమస్యల భాగ పరిష్కారాలపై 23 మంది అర్జీలు అందజేశారు. ఆర్టీఐ కేసుల విచారణలో ఆర్డీవో ఇరువర్గాలను విచారించారు. మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు సమాచారం ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. దీనిపై సరైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో సంబంధిత అధికారులను ఆదేశించారు. హార్సిలీహిల్స్ చెక్పోస్టు వద్ద ప్రతిరోజూ హిల్స్కు వచ్చిపోయే వాహనాల నెంబర్లు, డ్రైవర్ల ఫోన్ నెంబర్లు నమోదు చేయాలని కాంట్రాక్టర్ను ఆర్డీవో ఆదేశించారు. ఆగస్టు లోగా ప్రభుత్వానికి బకాయిలు పూర్తిగా చెల్లించాలని ఆదేశించారు. పట్టణంలోని ఎస్టీ హాస్టల్ పక్కన నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక భవనాలను ఆర్డీవో పరిశీలించి, వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.