పంపిణీకి సిద్ధంగా మూడు చక్రాల వాహనాలు
ABN , First Publish Date - 2022-10-15T05:06:27+05:30 IST
అన్నమయ్య జిల్లాలో ఉన్న దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాల పంపిణీకి రంగం సిద్ధమైంది.
రాయచోటి(కలెక్టరేట్), అక్టోబరు 14: అన్నమయ్య జిల్లాలో ఉన్న దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాల పంపిణీకి రంగం సిద్ధమైంది. జిల్లాకు మూడు చక్రాల వాహనాలు 53 రావాల్సి ఉండగా... 36 వచ్చాయని ఏడీ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, వికలాంగ ట్రాన్స్జెండర్లు, వయోవృద్ధులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కృష్ణకిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సీనియర్ సిటిజన్స్, అంగవైకల్యం కలిగిన 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్న వారందరూ కూడా అర్హులన్నారు. వీరంతా కనీసం పదవ తరగతి పాసై ఉండాలని వారు పేర్కొన్నారు. లబ్ధిదారుల వార్షిక ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలని, రెండు నెలల ముందే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఎటువంటి సొంత వాహనం ఉండకూడడదన్నారు. లబ్ధిదారులకు అంగవైకల్యం 70 శాతంపైగా ఉండాలని తెలిపారు. జిల్లా మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన సదరన్ ధ్రువపత్రం, ఆధార్కార్డు, ఎస్ఎస్సీ సర్టిఫికెట్, కులధ్రువీకరణ పత్రం, దివ్యాంగులుగా ఉన్న ఫొటో దరఖాస్తుతో పాటు తీసుకురావాలని వారు తెలిపారు.