నేతన్నల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2022-08-26T04:54:40+05:30 IST
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెడుతోందని, లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి చెందాలని కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు.
కలెక్టర్ గిరీషా, జడ్పీ చైర్మన్ ఆకేపాటి
రాయచోటి (కలెక్టరేట్), ఆగస్టు 25: చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెడుతోందని, లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి చెందాలని కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. గురువారం సీఎం జగన్ కృష్ణా జిల్లా పెడన వేదిక నుంచి నాల్గో విడత వైఎ్సఆర్ నేతన నేస్తం డబ్బును లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ గిరీషా, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ డైరెక్టర్ సురేంద్రనాధ్, రాష్ట్ర తొగటవీర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నీలం రమణమ్మ, రాష్ట్ర తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు మోడెం ఆంజనేయప్రసాద్, జిల్లా చేనేత జౌళి శాఖాధికారి శ్రీనివాసులరెడ్డి, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వీటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులై ఉండి నేతన్న నేస్తం డబ్బులు అందకపోతే వెంటనే తమకు దగ్గరలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మీ దరఖాస్తును పరిశీలించి అర్హత ఉంటే నేతన్న నేస్తం డబ్బులు ఇస్తామని తెలిపారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ నేతన్నల ఆర్థికాభివృద్ధి జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వైఎ్సఆర్ నేతన్న నేస్తం ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి అన్నమయ్య జిల్లాలోని 7202 మంది చేనేత కార్మికులకు రూ.17.28 కోట్ల మెగా చెక్కును ముఖ్య అతిథుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.