పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ధి
ABN , First Publish Date - 2022-08-31T06:10:55+05:30 IST
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నూతనంగా పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా
రాయచోటి(కలెక్టరేట్), జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నూతనంగా పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎక్స్పర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనతోనే జిల్లా అభివృద్ధి చెందుతుందని, జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు పారి శ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో నూతనంగా పరిశ్ర మలు స్థాపించడానికి అనుమతులకు సంబంధించి ఇప్పటివరకు 1368 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 1314 దరఖాస్తులను క్లియర్ చేశామన్నారు. వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం కింద 13 యూని ట్లకు (వాహనాలు) పెట్టుబడి రాయితీకి సంబంధించి రూ.76,17,227 మంజూరు చేశామని తెలిపారు. పావలావడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ 6 పరిశ్రమలకు సంబంధించి 10 దరఖాస్తులకు గానూ రూ.17,03,147 మంజూరు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ రాయతీ 1 పరిశ్రమకు సంబంధించి 2 దరఖాస్తులకు గానూ రూ.1,37,221 మంజూరైందని తెలిపారు. రాయచోటి ఇండస్ర్టీయల్ ఎస్టేట్లో సేల్ డీడ్ కోసం సమగ్ర నివేదికతో తదుపరి సమావేశంలో పొందుపరచాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ నాగరాజ, లీడ్ బ్యాంక్ మేనేజర్ మఽధుసూదన్రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.