లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-09-14T04:49:13+05:30 IST
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శాంతికళ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులను హెచ్చరించారు.
రూ.50వేలు జరిమానా : డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శాంతికళ
ప్రొద్దుటూరు క్రైం, సెప్టెంబరు 13 : లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శాంతికళ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులను హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలో పలు స్కానింగ్ సెంటర్లను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా సెంటర్లల్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ శాంతికళ మాట్లాడుతూ గర్భస్థ శిశువు ఆరోగ్య పరిస్థితి, ఎదుగుదల విషయాల గురించి స్కానింగ్ చేయడం, దానికి సంబంధించి మాత్రమే రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా ప్రలోభాలకు పోయి లింగ నిర్ధారణ చేస్తే శాఖాపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు రూ.50వేలు జరిమానాతో పాటు సంబంధిత స్కానింగ్ సెంటర్ను సీజ్ చేస్తామన్నారు. గర్భిణులు కూడా వైద్యుల సూచనల మేరకు స్కానింగ్ చేయించుకోవాలని, పుట్టబోయేది ఎవరైంది తెలుసుకునే ప్రయత్నం కూడా నేరమే అవుతుందన్నారు. స్కానింగ్ సెంటర్లో రికార్డులు సక్రమంగా నిర్వహణ చేయాలని, స్కానంగ్ చేయించుకున్న వారి పూర్తి వివరాలు రిజిష్టర్లో నమోదు చేయడంతో పాటు, ఆ వివరాలను ఆన్లైన్లో పెట్టాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.