నాటుసారా, ఎర్రచందనంపై నిఘా ఉంచండి

ABN , First Publish Date - 2022-07-06T04:42:52+05:30 IST

అధికారుల కళ్లు కప్పి గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలుతున్న నాటుసారా, ఎర్రచందనం అక్రమ రవాణాలపై పెట్రోలింగ్‌ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు.

నాటుసారా, ఎర్రచందనంపై నిఘా ఉంచండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

ఎస్పీ వర్షవర్ధన్‌రాజు

రాయచోటి టౌన్‌, జూలై 5: అధికారుల కళ్లు కప్పి గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలుతున్న నాటుసారా, ఎర్రచందనం అక్రమ రవాణాలపై పెట్రోలింగ్‌ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన పెట్రోలింగ్‌ సిబ్బంది సమీక్షలో మాట్లాడుతూ చెక్‌పోస్టులు, హైవేలలో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ చేపట్టే సిబ్బంది నాటుసారా, ఎర్రచందనం అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపట్టడం ద్వారా నాటుసారా, ఎర్రచందనం అక్రమ రవాణాను కట్టడి చేయవచ్చునన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆపద సమయంలో వారికి సహాయం చేసే విధంగా ఉండాలన్నారు. హైవే పెట్రోలింగ్‌ వారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడడమే కాకుండా ప్రమాదాలు జరిగిన సమయంలో గాయపడిన వారిని సత్వరమే హాస్పిటల్‌కు తరలించడంలో సహాయం చేయాలని సూచించారు. పెట్రోలింగ్‌ సిబ్బంది ఎవరైనా విధి నిర్వహణలో జాప్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా, అక్రమ సంపాదనకు ఆశపడినా అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2022-07-06T04:42:52+05:30 IST