మోటరు సైకిళ్ల దొంగల అరెస్టు
ABN , First Publish Date - 2022-10-13T05:07:42+05:30 IST
మోటరు సైకిళ్ల చోరీ కేసు లో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి బైకులు స్వాధీనం చేసుకున్నట్లు రిమ్స్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య తెలిపారు.
కడప (క్రైం), అక్టోబరు 12: మోటరు సైకిళ్ల చోరీ కేసు లో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి బైకులు స్వాధీనం చేసుకున్నట్లు రిమ్స్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య తెలిపారు. సీఐ వివరాల మేరకు.. ఈ నెల 9న నగరంలోని తిలక్నగర్కు చెందిన శ్రీనివాసులు తన ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచిన బైకును దొంగతనం చేసినట్లు ఫిర్యాదు చేశారన్నారు. అలాగే రిమ్స్ ఆసుపత్రి వద్ద పార్కింగ్ చేసి ఉంచిన తన బైకును దొంగిలించినట్లు చెక్క చిరంజీవి ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈక్రమంలో బుధవారం కడప - రాజంపేట రోడ్డులో ఓల్డ్ బైపాస్ సర్కిల్ వద్ద తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో కడపకు చెందిన నాగలారపు రవి, వల్లెపు రామాంజులు అప్సర సర్కిల్ వైపు దొంగలించిన మోటరు సైకిళ్లపై వెళుతుండడంతో వారిని అరెస్టు చేశామన్నారు. అలాగే తిరుపతి - ఎర్రగుంట్ల బైపాస్ వద్ద చలమారెడ్డిపల్లె వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా కన్నలూరు మనోహర్ అనే వ్యక్తి పోలీసులను చూసి మోటరు సైకిల్పై పారిపోతుండగా అరెస్టు చేశామన్నారు. వీరు మోటరు సైకిళ్లను దొంగలించి విడి భాగాలను అమ్ముకుంటారని తెలిపారు. వీరి వద్ద నుంచి దొంగలించిన మోటరు సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు.