ఆడపిల్లలను పుట్టనిద్దాం
ABN , First Publish Date - 2022-10-12T04:32:29+05:30 IST
ఆడపిల్లను పుట్టనిద్దామని పీహెచ్సీ వైద్యాధికారి రూబీనా, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు అన్నారు.
ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 11 : ఆడపిల్లను పుట్టనిద్దామని పీహెచ్సీ వైద్యాధికారి రూబీనా, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ప్రపంచ బాలికాదినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వోదయ ఇంటిగ్రెటేడ్ రూరల్ డెవల్పమెంట్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక లేపాక్షి డిగ్రీ కళాశాలలో సమావేశం జరిగింది. సమావేశంలో సిర్డ్స్ సొసైటీ అధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి, సీవో నాగజ్యోతి, ఏఎన్ఎం జ్యోతి, కళాశాల కరస్పాండెంట్ రాఘవరెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు టౌన్..: బాలికల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర బాలికల హక్కుల సంరక్షణ కమిషనర్ సభ్యురాలు ఎం.లక్ష్మీదేవి తెలిపారు. మంగళవారం గాయత్రి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ రాణి మాట్లాడుతూ విద్యార్థులు బాల్య వివాహాలను వ్యతిరేకించాలని తెలిపారు. అనంతరం పాఠశాలలో ప్రతిభకనబరిచిన విద్యార్థులకు మెమెంటోలను అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, చైల్డ్ హెల్పలైన్ ఆఫీసర్ రాఘవేంద్ర, అర్బన్ సీడీపీఓ హైమావతి, ట్రస్టు చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్లు, రచయిత తవ్వా వెంకటయ్య, శూలం ప్రసాద్, హెచ్ఎం కాశీ ప్రసాద్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పోరుమామిళ్ల..: బాలికలు ప్రతి ఒక్కరూ విద్యలో రాణించాలని ఎస్ఐ హరి ప్రసాద్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా పోరుమామిళ్లలోని ఓఎల్ఎఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఎంచుకుని విద్యనభ్యసించాలన్నారు. ఽధైర్యంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఓఎల్ఎఫ్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ముస్కాన్ ఆపరేషన్లో భాగంగా పోరుమామిళ్లలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు బాలురను గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఖాజీపేట..: మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో విజయం సాధించి ఉన్నతస్థాయికి ఎదుగుతారని సీడీపీవో రమాదేవి తెలిపారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు నాగరత్నమ్మ, రెడ్డమ్మ, ఓబుళమ్మ, అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.