దళితుల నోట్లో మట్టి కొట్టిన జగన్‌

ABN , First Publish Date - 2022-09-14T05:06:57+05:30 IST

దళిత, గిరిజనులకు మేలు చేస్తాడని విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపిస్తే... దళితుల నోట్లో జగన్‌రెడ్డి మట్టి కొట్టారని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీసాల ప్రేమ్‌కుమార్‌ ధ్వజ మెత్తారు.

దళితుల నోట్లో మట్టి కొట్టిన జగన్‌
సమావేశంలో మాట్లాడుతున్న మీసాల ప్రేమ్‌కుమార్‌

 బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  


కడప (మారుతీనగర్‌), సెప్టెంబరు 13 : దళిత, గిరిజనులకు మేలు చేస్తాడని విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపిస్తే... దళితుల నోట్లో జగన్‌రెడ్డి మట్టి కొట్టారని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీసాల ప్రేమ్‌కుమార్‌ ధ్వజ మెత్తారు. మంగళవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి  ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో దళితులపై యథేచ్ఛగా వైసీపీ గూండాలు, రౌడీమూకలు దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దళిత గిరిజన ఓట్ల కోసం దండాలు పెట్టి గద్దెనెక్కగానే వారిపై దాడులు, హత్యలు చేయడం పనిగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. దళిత, గిరిజనులపై జరుగుతున్న అకృత్యాలను ఎండగట్టేందుకు గ్రామస్థాయి నుంచి దళితులను జాగృతం చేస్తామన్నారు. అప్పటికీ దళితులు అపమ్రత్తం కాకపోతే జగన్‌ పాలనలో అథోగతి తప్పదన్నారు. ఈక్రమంలో ఎస్సీ మోర్చాను అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం చేసేందుకు ప్రతి మండలంలో కమిటీలను ఏర్పాటు చేసి గ్రామస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్పీ మోర్చా రాష్ట్ర నాయకులు వై.హరినారాయణరావు, ఎస్సీ మోర్చా జిల్లా ఇన్‌చార్జి కుమారస్వామి, అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జోనల్‌ ఇన్‌చార్జ్‌ ఆర్‌.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-14T05:06:57+05:30 IST