గడప గడపలో నిలదీత

ABN , First Publish Date - 2022-09-30T05:07:29+05:30 IST

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని గురువారం చిన్నమండెం మండలం కేశాపురం కస్పాలో ఓ రైతు కుటుంబం నిలదీసింది. వరలక్ష్మి అనే మహిళా రైతు, ఆమె భర్త పంట నష్టపరిహారం విషయంలో తమకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

గడప గడపలో నిలదీత
ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని నిలదీస్తున్న మహిళా రైతు వరలక్ష్మి

- పంట నష్టపరిహారం రాలేదని ఎమ్మెల్యే ఎదుట ఆవేదన

రాయచోటి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని గురువారం చిన్నమండెం మండలం కేశాపురం కస్పాలో ఓ రైతు కుటుంబం నిలదీసింది. వరలక్ష్మి అనే మహిళా రైతు, ఆమె భర్త పంట నష్టపరిహారం విషయంలో తమకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో రెండు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయని, తాము సాగు చేసిన వరిపంట మొత్తం వర్షానికి కొట్టుకుపోయిందన్నారు. అయితే తమకు కనీసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం రాలేదన్నారు. చాలా మంది పంట సాగు చేయకపోయినా.. ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి రూ.70 వేలు, రూ.80 వేలు వచ్చాయని, తమకు కనీసం రూ.10 వేలైనా పడకపోతే బాధ ఉండదా.. అని నిలదీశారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ.. ‘మీ ఆవేశం నాకు అర్థమైంది. నేను చెప్పేది కూడా వినాలి’ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే చెప్పేది వినిపించుకోకుండా.. ఓట్లు అడిగినప్పుడు ఓట్లు వేశామని, కానీ మాకు మీరు ఏం చేశారని నిలదీశారు. ఈ గ్రామంలో చాలా పలువురు తమకు నష్టపరిహారం పడలేదంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.


Updated Date - 2022-09-30T05:07:29+05:30 IST