‘భరోసా’తో రైతులకు కుచ్చుటోపీ!

ABN , First Publish Date - 2022-06-08T04:51:24+05:30 IST

రైతు భరోసా పేరుతో రైతులకు రావాల్సిన అన్ని రాయితీలు రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టిందని రాయచోటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

‘భరోసా’తో రైతులకు కుచ్చుటోపీ!

గాలివీడు, జూన్‌ 7:  రైతు భరోసా పేరుతో రైతులకు రావాల్సిన అన్ని రాయితీలు రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టిందని రాయచోటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో తూముకుంట ఈశ్వర్‌రెడ్డి ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రైతులకు అందాల్సిన పెట్టుబడి రాయితీ, పంటల భీమా వంటి  పథకాలను పూర్తిగా ఎత్తి వేయడాన్ని ఆయన ఆక్షేపించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ప్రతి ఏడాది వేలాది రూపాయల పెట్టుబడి రాయితీ, పంట, బీమా ఉండేదని, ప్రస్తుతం కేవలం ఏడాదికి రూ.7,500లతో రైతులను నట్టేట ముంచారన్నారు. గతంలో సూక్ష్మబిందు సేద్యానికి ఎస్సీ, ఎస్టీలకు వందశాతం, మిగిలిన సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో బిందు సేద్య పరికరాలు అందించారని ప్రస్తుతం ఆ పథకాలను అటకెక్కించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్య క్షుడు లక్ష్మయ్య, సర్పంచ్‌లు పార్థసారఽథి రెడ్డి, రవికుమార్‌నాయుడు, మాజీ సర్పంచ్‌లు మహమ్మద్‌రియాజ్‌, చిన్నప రెడ్డి, మాజీ ఎంపీటీసీ శేషారెడ్డి, టీడీపీ నాయకులు డాక్టర్‌ రామచంద్రారెడ్డి, ధర్మారెడ్డి, వీర రాఘవులు, ప్రభాకర్‌రెడ్డి, వక్ఫ్‌బోర్డు సభ్యులు మహబూబ్‌బాషా, తెలుగు యువత మీడియా కో ఆర్డినేటర్‌ రామాంజులు నాయుడు, టీడీపీ యువత నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, జక్రియాబాషా తదితరులు పాల్గొన్నారు.

ప్రజలపై బాదుడు తప్ప అభివృద్ధి శూన్యం

సంబేపల్లె: వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో ప్రజలపై పన్నుల బాదుడు తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని రాయచోటి టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమే్‌షకుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం గురిగింజకుంట గ్రామం నాయునివారిపల్లె, హరిజనవాడలో బాదుడే బాదు డు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు చిన్నరెడ్డెయ్యయాదవ్‌, టీడీపీ నాయకులు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం మోపిన పన్నుల భారంపై అవగాహన కల్పించారు. కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయన్నారు. మూడేళ్ల కాలంలో రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.  వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేకాలం వస్తోందని హెచ్చరించారు. 

Updated Date - 2022-06-08T04:51:24+05:30 IST