అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-11-30T23:37:36+05:30 IST

ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 110 కేజీలు బరువు గల ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ వెల్లడించారు.

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
పట్టుబడిన ఎర్రచందనం దుంగలు, నిందితులు

కడప (క్రైం), నవంబరు 30 : ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 110 కేజీలు బరువు గల ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ వెల్లడించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ చెంచుబాబు, మైదుకూరు రూరల్‌ సీఐ నరేంద్రారెడ్డి, రెడ్‌ శాండల్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ నాగభూషణం, మఠం ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ కుళ్లాయప్పతో కలిసి ఆయన విలేకరులకు నిందితుల వివరాలు వెల్లడించారు. బద్వేలు - మైదుకూరు రోడ్డు నుంచి లంకమల్ల రిజర్వు ఫారెస్టుకు వెళ్లే మట్టి దారి వద్ద ఎర్రచందనం దుంగలు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం అందడంతో జిల్లా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌, మైదుకూరు రూరల్‌ సీఐలు, బి.మఠం ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ కుళ్లాయప్ప దాడి చేశారు. తమిళనాడులోని సేలం జిల్లా ఎడ్డపటికి చెందిన శివన్‌బాబు, కనరాజు, కల్లుకుర్చి జిల్లా తాల్‌కడింగల్‌ గ్రామానికి చెందిన కరియన్‌ కామరాజ్‌ను అరెస్టు చేసి, ఐదు ఎర్రచందనం దుంగలు, ఒక సెల్‌ఫోన్‌, మూడు గొడ్డళ్లను, మూడు పట్టుడు రాళ్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. శివన్‌ బాబు, కనకరాజుౖ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లర్లకు కూలీలను పంపుతుంటారన్నారు. వీరిపైౖ ఆయా పోలీసుస్టేషన్లలో ఒక్కొక్కరిపై 8 కేసులు నమోదయ్యాయన్నారు. ఇక కరియన్‌ కామరాజుపై ముద్దనూరు పోలీసుస్టేషన్‌లో కేసు ఉందన్నారు. మరికొంత మంది నిందితులు పారిపోయారని తెలిపారు. పట్టుబడిన వారిపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ చెంచుబాబు, మైదుకూరు ఎస్డీపీవో వంశీధర్‌గౌడ్‌తో పాటు దాడుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని అభినందించారు.

Updated Date - 2022-11-30T23:37:42+05:30 IST