Tulsi Reddy: హోదా లేదు.. పోలవరం కాదని కేంద్రం చెప్పడం సరికాదు...
ABN , First Publish Date - 2022-12-13T12:17:34+05:30 IST
కడప జిల్లా: ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, రాష్ట్రానికి సంజీవని అని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు.
కడప జిల్లా: ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, రాష్ట్రానికి సంజీవని అని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హోదా లేదు.. పోలవరం కాదని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. విభజన చట్టం ప్రకారం పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. హోదా అమలు, పోలవరం పూర్తి కాంగ్రెస్తోనే సాధ్యమని తులసిరెడ్డి పేర్కొన్నారు.
2014 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా తులసిరెడ్డి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి భగవంతుడు ప్రసాదించిన వరమని, విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయికట్టు, 10.13 లక్షల ఎకరాల స్థిరీకరణ, 540 గ్రామాలకు త్రాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి, గోదావరి కృష్ణా నదుల అనుసంధానం తదితర ప్రయోజనాలు ఉన్నాయని తులసిరెడ్డి పేర్కొన్నారు.