129.35 క్వింటాళ్ల చౌక బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-09-22T04:37:36+05:30 IST

పేదలకు అందాల్సిన చౌక బియాన్ని అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.

129.35 క్వింటాళ్ల చౌక బియ్యం పట్టివేత
పట్టుబడ్డ బియ్యంతో విజిలెన్స్‌ సీఐ పురుషోత్తంరాజు

లారీతో పాటు రెండు ఆటోలు, బైకు, 8 మంది అరెస్టు


చెన్నూరు, సెప్టెంబరు 21 : పేదలకు అందాల్సిన చౌక బియాన్ని అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీతో పాటు రెండు ఆటోలు, ఒక బైకు, 8 మందిని అరెస్టు చేశారు. విజిలెన్స్‌ సీఐ పురుషోత్తంరాజు వివరాల మేరకు.. చెన్నూరు మండలం గోపవరం గ్రామం వద్ద రెండు ఆటోల్లో  చౌక బియాన్ని తీసుకువచ్చి ఓ లారీకి లోడు చేస్తున్న సమయంలో తమ సిబ్బందితో కలసి దాడి చేశామన్నారు. లారీలో ఉన్న 129.35 క్వింటాళ్ల చౌక బియ్యం బస్తాలతో పాటు  రెండు ఆటోలను, బైకును స్వాధీనం చేసుకొని, 8 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడిన ప్రధాన నిందితుడు చెన్నూరుకు చెందిన కె.వీరబ్రహ్మంతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు ఉన్నారని సీఐ తెలిపారు. చాలాకాలంగా చౌక బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి రావడంతో ప్రత్యేక  నిఘా పెట్టి బుధవారం సిబ్బందితో కలిసి దాడులు చేసి పట్టుకున్నామన్నారు. ప్రభుత్వం పేదలకందించే బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టుబడిన బియ్యాన్ని సీజ్‌ చేసి గోదాముకు తరలించామని.. వాహనాలను, నిందితులను పోలీసులకు అప్ప జెప్పామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంటు డీటీ సౌజన్య, చెన్నూ రు వీఆర్వో నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-09-22T04:37:36+05:30 IST