Pawan kalyan: సరస్వతి దేవికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2022-09-30T14:05:24+05:30 IST
శరన్నవరాత్రి పర్వదినాల్లో భాగంగా పంచమి తిధి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరస్వతీ దేవిని అర్చించారు.
అమరావతి: శరన్నవరాత్రి పర్వదినాల్లో భాగంగా పంచమి తిధి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సరస్వతీ దేవిని అర్చించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేనాధిపతి ప్రత్యేక పూజ చేశారు. తెలుగు రాష్ట్రాలకు సకల శుభాలు కలుగ చేయాలని కోరుకున్నట్లు పవన్ చెప్పారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులు, కార్యాలయ నిర్వాహకులతో జనసేనాని సమావేశమయ్యారు. అక్టోబర్లో పార్టీపరంగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించనున్నారు. మంగళగిరిలో నిర్వహించనున్న పార్టీ సమావేశాలకు సంబంధించి సూచనలు చేయనున్నారు. క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన వలంటీర్లు, వీర మహిళలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. సోషల్ మీడియా - శతఘ్ని క్రియాశీలక సభ్యులతో త్వరలో సమావేశం కానున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అటు జిల్లాలవారీగా కూడా జనసేనాని సమీక్షలు చేపట్టబోతున్నారు. కృష్ణా జిల్లా, విజయవాడ అర్బన్లతో సమీక్షలు మొదలుకానున్నాయి. ‘‘నా సేన నా వంతు’’ కార్యక్రమంపైనా సమీక్ష చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర యాత్ర నిర్వహణకు సంబంధించి సన్నాహకాలపై త్వరలో ముఖ్య నేతలతో సమావేశం అవనున్నారు. గతంలో సంకల్పించిన అనుష్టుప్ నారసింహ యాత్రపై చర్చించనున్నారు. తొలుత కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు జరిపి ధర్మపురి క్షేత్రానికి వెళ్లి నరసింహ స్వామిని దర్శించే విధంగా ప్రణాళికలు రూపొందించనున్నారు. త్వరలో తెలంగాణలో పార్టీ శ్రేణులతో పవన్ సమావేశం నిర్వహించేలా షెడ్యూల్ ప్లాన్ సిద్ధంకానుంది.