ఎన్టీఆర్ పేరు తీసేయడం సరికాదు
ABN , First Publish Date - 2022-09-24T09:16:27+05:30 IST
ఎన్టీఆర్ పేరు తీసేయడం సరికాదు
ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమందిని అవమానించినట్లే
రేపు వచ్చే ప్రభుత్వం పేరు మారిస్తే వైఎస్కూ అది అవమానమే
ఆయనకు మరొకరి ఖ్యాతి అక్కర్లేదు
నాన్న నన్ను ప్రేమించినంతగా మరెవరినీ ప్రేమించలేదు
జగన్ సోదరి షర్మిల వ్యాఖ్యలు
వికారాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చుతూ తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ద్వంద్వంగా ఖండించారు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగించడం సరికాదన్నారు. అలా పేరు మార్చడం ఎన్టీఆర్ను అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమానించినట్లేనన్నారు. షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలో సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్కు ఉన్న ఖ్యాతి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని, ఆయన మరణాన్ని తట్టుకోలేక 700 మంది చనిపోయారని పేర్కొన్నారు. అలాంటి వైఎస్సార్కు వేరొకరి ఖ్యాతిని ఆపాదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘‘నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు. ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాధించినంతగా మరెవరూ ఆరాధించి ఉండరు. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు. రేపు వచ్చే ప్రభుత్వం ఆ పేరు మారిస్తే.. అప్పుడు వైఎ్సనూ అవమానించినట్లే అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. వీఆర్ఏల ఆందోళనకు షర్మిల మద్దతు తెలిపారు. 60 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారని.. వారిని చర్చలకు పిలిచిన మంత్రి కేటీఆర్.. తెగేదాకా లాగొద్దు అని బెదిరించడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే 30 మంది ఆత్మహత్మ చేసుకున్నారని, ఇంకా ఎందరిని పొట్టన పెట్టుకుంటారని ప్రభుత్వాన్ని నిలదీశారు. పాదయాత్రలో భాగంగా మోమిన్పేటలో జరిగిన సభలో షర్మిల మాట్లాడారు. కొందరు వీఆర్ఏను ఆమెను కలిశారు. వీఆర్ఏల బంధువుల జాబితా తీసుకుని వారిని బెదిరిస్తున్నారని.. ఇదెక్కడి దారుణమని ప్రశ్నించారు. వీఆర్ఏల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించారు. కేసీఆర్తో ఒక్కరైనా లబ్ధి పొందారా? ఒక్క వర్గానికైనా లాభం జరిగిందా? అని షర్మిల ప్రశ్నించారు. ముష్టి రూ.5 వేల రైతుబంధు ఇచ్చి రైతులను కోటీశ్వరులను చేశానని చెబుతున్నారని, ఈ దరిద్రం ఇక్కడితో చాలదన్నట్లుగా.. ఇక దొర దేశాలు ఏలబోతారట అని ఎద్దేవా చేశారు. నవాబ్పేట మండలం మమ్మదాన్పల్లిలో రైతులతో షర్మిల సంభాషించారు. ధరణితో ప్రతి గ్రామంలో వెయ్యి, 2 వేల ఎకరాల వివరాల్లో తప్పులు దొర్లాయని, తమ భూములు రిజిస్ట్రేషన్లు కాకుండా పోయాయని వాపోయారు. కలెక్టరేట్కు వెళ్తే ఎకరాకు రూ.లక్ష ఖర్చు పెట్టుకుంటే పనవుతుందని చెబుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. మీ భూములు మీకు ఇప్పించే బాధ్యత తనదని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని ఎత్తేస్తామని భరోసా ఇచ్చారు. కాగా, షర్మిల పాదయాత్ర 161వ రోజు శుక్రవారం కొత్తగడి, నవాబ్పేట్ అడ్డ రోడ్డు, మమ్మదాన్పల్లి, గేట్వనంపల్లి, వెల్చాల్, మొరంగపల్లి మీదుగా మోమిన్పేట్ వరకు కొనసాగింది.