తెలంగాణ సర్వీసుల్లోకి ఐపీఎస్ అభిషేక్ మహంతి
ABN , First Publish Date - 2022-03-16T09:21:44+05:30 IST
ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని తెలంగాణ సర్వీసుల్లోకి తీసుకుంటున్నామని, ఈమేరకు జీవో సైతం జారీచేశామని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు
హైదరాబాద్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని తెలంగాణ సర్వీసుల్లోకి తీసుకుంటున్నామని, ఈమేరకు జీవో సైతం జారీచేశామని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు తెలిపింది. ఈ కేసును పరిశీలిస్తే.. మహంతిని తెలంగాణ సర్వీసుల్లోకి తీసుకోవాలని క్యాట్ గతంలో ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీంతో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ సోమేశ్కుమార్కు క్యాట్ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని సీఎస్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు మహంతి విషయంలో క్యాట్ ఆదేశాలను అమలు చేయాలంటూ ఇప్పటికే తాము స్పష్టత ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎస్ తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఆయనను తెలంగాణ సర్వీసుల్లోకి తీసుకుంటూ జీవో జారీచేశామని పేర్కొన్నారు. ఈ వాదనతో జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎ.వెంకటేశ్వర రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సంతృప్తి చెందింది. సీఎస్ హాజరుపై మినహాయింపు ఇచ్చింది.