వెబ్ల్యాండ్లో.. భూ స్వభావం మార్చే అధికారం జేసీలకు
ABN , First Publish Date - 2022-10-14T07:21:41+05:30 IST
వెబ్ల్యాండ్లో సవరణలపై రెవెన్యూశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
సీసీఎల్ఏ మార్గదర్శకాలు జారీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి): వెబ్ల్యాండ్లో సవరణలపై రెవెన్యూశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్ల్యాండ్ రికార్డుల్లో భూమి స్వభావం, సర్వేనెంబర్ల నమోదు, సవరణ అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు అప్పగిస్తూ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి సవరణలకు అవకాశం ఉందో నిర్దేశిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశా రు. వాటిని వెంటనే అమల్లోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గతంలో వెబ్ల్యాండ్లో మిస్సింగ్ సర్వేనెంబర్లు, భూమి స్వభావం అంటే ప్రభుత్వం నుంచి ప్రైవేటుకు, ప్రైవేటు నుంచి ఇతర కేటగిరీలకు మార్చే అధికారం తహసీల్దార్లకు ఉండేది. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు పరాధీనం చేశారు. ఆ అధికారాలను నిలిపివేసి నేరుగా సీసీఎల్ఏ నియంత్రణలోని పీడీ సీఎంఆర్ఓకు వెబ్ల్యాండ్ సవరణ బాధ్యతలు అప్పగించారు. దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని విమర్శలు వచ్చాయి. ఈమేరకు ఇటీవల జరిగిన సమీక్షలో వెబ్ల్యాండ్ సవరణపై నిర్ణయం తీసుకున్నారు.