వైద్యుల సమస్యల పరిష్కారానికి ఐఎంఏ కృషి

ABN , First Publish Date - 2022-11-30T03:06:39+05:30 IST

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)లో సభ్యులుగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు ఐఎంఏ తన వంతు కృషి చేస్తుందని ఆ సంస్థ ఏపీ నూతన అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ అన్నారు.

వైద్యుల సమస్యల పరిష్కారానికి ఐఎంఏ కృషి

ఏపీ నూతన అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ

వన్‌టౌన్‌, నవంబరు 29: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)లో సభ్యులుగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు ఐఎంఏ తన వంతు కృషి చేస్తుందని ఆ సంస్థ ఏపీ నూతన అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన విజయవాడలోని ఐఎంఏ హాలులో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఉన్న ఐఏంఏలో దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాల్లో 1,750 శాఖల్లో మూడున్నర లక్షలమంది వైద్యులు సభ్యులుగా ఉన్నారని, ఏపీలో వంద శాఖల్లో 60 వేలమంది సభ్యులున్నారని తెలిపారు. చాలామందికి ఐఎంఏ అంటే ప్రైవేట్‌ సంస్థ అన్న అపోహ ఉందని, దీనిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు సభ్యులుగా ఉన్నారని, వారి సమస్యల పరిష్కారానికి సంస్థ కృషి చేస్తుందన్నారు. వైద్యులపైన, ఆసుపత్రులపైనా దాడులను నివారించి వైద్యులు స్వేచ్ఛగా పనిచేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. చికిత్స వ్యయాలు పెరిగినందున ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్యాకేజీ మొత్తం పెంచాలని, శిక్షణ లేకుండా వైద్యం చేస్తున్న క్లినిక్‌లపై చర్యలు తీసుకోవాలని కోరారు. పేద ప్రజల కోసం వైద్యశిబిరాలు నిర్వహించేందుకు ఐఎంఏకు సొంత భవనాలను నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించాలన్నారు. జాతీయ వైద్యదినోత్సవం నాడు రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన వైద్యులకు కూడా పురస్కారాలు అందజేయాలన్నారు. ఆయుష్‌ వైద్యులకు స్వల్పకాలిక అల్లోపతి శిక్షణ ఇచ్చే విధానాన్ని పునఃపరిశీలించాలన్నారు.

Updated Date - 2022-11-30T03:06:40+05:30 IST