అన్నం పెడితే కేసులు పెడతా!!
ABN , First Publish Date - 2022-06-07T09:52:58+05:30 IST
‘‘రోడ్డు పక్కన అన్న మొబైల్ క్యాంటీన్లో భోజనం పెడితే మీపై కేసులు నమోదు చేస్తా’’ అని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వన్టౌన్ సీఐ ఇస్మాయిల్ టీడీపీ నేతలను హెచ్చరించారు.
టీడీపీ నేతలకు సీఐ హెచ్చరిక ..
అన్న క్యాంటీన్ తెరవొద్దని హుకుం
హిందూపురం టౌన్, జూన్ 6: ‘‘రోడ్డు పక్కన అన్న మొబైల్ క్యాంటీన్లో భోజనం పెడితే మీపై కేసులు నమోదు చేస్తా’’ అని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వన్టౌన్ సీఐ ఇస్మాయిల్ టీడీపీ నేతలను హెచ్చరించారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఎన్ఆర్ఐల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నమొబైల్ క్యాంటీన్ను ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర ప్రారంభించారు. రోజూ మధ్యాహ్నం రూ.2కే ఈ క్యాంటీన్ వద్ద భోజనం అందిస్తున్నారు. మొదటిరోజు మినహా మరుసటి రోజు నుంచి క్యాంటీన్పై పోలీసులు విరుచుకు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు క్యాంటీన్ను తెరవలేదు. చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చే నిరుపేదలు మధ్యాహ్నం అయ్యే సరికి సబ్రిజిస్ర్టార్ కార్యాలయం వద్ద వేచి ఉంటున్నారు. దీనిని గమనించిన టీడీపీ నాయకులు సోమవారం అక్కడకు ఈ క్యాంటీన్ను తరలించి, భోజనం పెట్టేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు దురుసుగా వ్యవహరించారు. సీఐ ఇస్మాయిల్ అక్కడికి చేరుకుని భోజనం పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు. టీడీపీ నాయకుల ఫొటోలను మొబైల్ ద్వారా చిత్రీకరించారు. కేసు నమోదు చేస్తున్నానంటూ హెచ్చరించారు.