ఎంపీ రఘురామ ఇంటి వద్ద ఆగంతకుడి రెక్కీ
ABN , First Publish Date - 2022-07-05T08:12:23+05:30 IST
ఎంపీ రఘురామ ఇంటి వద్ద ఆగంతకుడి రెక్కీ
గచ్చిబౌలి పోలీసులకు అప్పగించిన భద్రతా సిబ్బంది
ఆ వ్యక్తి ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్గా గుర్తింపు
రాయదుర్గం, జూలై4(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు హైదరాబాద్ నివాసం వద్ద ఆదివారం రాత్రి హైడ్రామా నడిచింది. ఓ ఆగంతకుడు ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అతనిని పట్టుకున్నారు. వారు ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తి తన వివరాలు వెల్లడించలేదు. అతనిని సోమవారం ఉదయం గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. అయితే, ఎంపీ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం కానిస్టేబుల్ షేక్ భాషా అని పోలీసు విచారణలో తేలింది.
ఈ ఘటనపై రఘురామరాజు పీఏ శాస్త్రి, షేక్ భాషా పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఆగంతుకుడి రెక్కీ అంశంపై ఎంపీ స్పందించారు. జగన్ తనపై కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. తనపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తనకు రక్షణ కల్పిస్తున్నదని, కానీ మరింత భద్రత కావాలని కోరుతానని తెలిపారు. తన ఇంటి వద్ద రెక్కీ చేస్తున్న ఓ వ్యక్తితోపాటు అతనికి చెందిన ఓ వ్యాన్ను తమ భద్రతా సిబ్బంది గుర్తించారని వివరించారు.