rains: వాయుగుండం.. దక్షిణ కోస్తా, రాయలసీమలలో భారీ వర్షం
ABN , First Publish Date - 2022-11-18T20:25:36+05:30 IST
అల్పపీడనం (low pressure) శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని మధ్య బంగాళాఖాతం (Bay of Bengal) పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. రానున్న 48 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడనున్నది.
విశాఖపట్నం: అల్పపీడనం (low pressure) శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని మధ్య బంగాళాఖాతం (Bay of Bengal) పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. రానున్న 48 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడనున్నది. తరువాత మూడు రోజులపాటు పశ్చిమ వాయువ్యంగా పయనించి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల దిశగా రానున్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 20వ తేదీ నుంచి 22 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. 21, 22 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. ఇంకా 20వ తేదీ నుంచి 22 వరకు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొనడంతో పలుచోట్ల చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.