మాండస్.. గుబులు
ABN , First Publish Date - 2022-12-10T01:26:54+05:30 IST
మాండుస్ హెచ్చరికలకు తోడు శుక్రవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం మారింది. మబ్బులు కమ్ముకు వచ్చి చినుకులతో ప్రారంభమై సాయంత్రానికి వర్షపుజల్లులు మొదలయ్యాయి. గాలుల కారణంగా కోతకు వచ్చిన వరి నేలవాలుతుంది.
భట్టిప్రోలు, నగరం, బాపట్ల, డిసెంబరు 9: మాండుస్ హెచ్చరికలకు తోడు శుక్రవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం మారింది. మబ్బులు కమ్ముకు వచ్చి చినుకులతో ప్రారంభమై సాయంత్రానికి వర్షపుజల్లులు మొదలయ్యాయి. గాలుల కారణంగా కోతకు వచ్చిన వరి నేలవాలుతుంది. మరోవైపు వాతావరణంలో మార్పులతో కోతలకు ఆటంకంగా మారింది. ఇప్పటికే కోత కోసిన వరి పంటను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం తుఫాన్ తీరం దాడే నేపథ్యంలో వర్షాలు పడే అవకాశం ఉండటంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన వరి పంట చేతికి అందివచ్చే తరుణంలో తుఫాన్ హెచ్చరికలు రైతుల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో కోత కోసిన వరి పంట ఓదెల రూపంలో పొలాల్లోనే ఉంది. పలు చోట్ల ఓదెలను కుప్పలుగా వేసుకుని పట్టాలు కప్పుతున్నారు మరో వారం రోజులు గడిస్తే పంట మొత్తం ఇళ్లకు చేరే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పడుతున్న వర్షాలు, గాలులతో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నగరంలో మధ్యాహ్నం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. ఇంకా కోత కోయని పంట భారీ వర్షం కురిస్తే నేలవాలుతుందని రైతులు వాపోతున్నారు. చలికాలానికి తోడు తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో ప్రజానీకం వణికిపోతుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితమౌతున్నారు. తుఫాన్ నేపథ్యంలో బాపట్ల కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ కె.విజయకృష్ణన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ నెంబరు 8712655881కు ఫోన్ చేయాలని ఆమె తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. అధికారులు ముందస్తు చర్యలలో పాల్గొనాలని ఆదేశించారు.