అమరావతిపై తప్పుడు ప్రచారం తగదు
ABN , First Publish Date - 2022-10-11T06:09:17+05:30 IST
రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడానికి దుష్టశక్తులను ప్రయోగిస్తున్నారని, అయినా ఏమీ చేయలేరని రాజధానికి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.
1028వ రోజుకు రైతుల ఆందోళనలు
తుళ్లూరు, అక్టోబరు 10: రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడానికి దుష్టశక్తులను ప్రయోగిస్తున్నారని, అయినా ఏమీ చేయలేరని రాజధానికి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు సోమవారం 1028వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అమరావతిపై తప్పుడు ప్రచారం తగదన్నారు. పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఊసెత్తకుండా ప్రాంతాల మఽధ్య విద్వేషాలను రగిల్చేందుకు మూడు రాజధానులను తెరమీదకు తెచ్చారన్నారు. అమరావతిపై కక్షతో మంత్రుల చేత అబద్ధాలు ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి బిల్డ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు.