కళాకారుల ఉన్నతికి మూలం రంగస్థలం

ABN , First Publish Date - 2022-10-05T06:12:59+05:30 IST

ళాకారుల ఉన్నతికి మూలం రంగస్థలమని, ఇప్పటికీ తన తల్లిదండ్రులు స్వగ్రామంలో కళా ప్రదర్శనలు ప్రోత్సహిస్తూ ఉంటారని సినీ దర్శకుడు వివి వినాయక్‌ చెప్పారు.

కళాకారుల ఉన్నతికి మూలం రంగస్థలం
నల్లూరి వెంకటేశ్వర్లుకు ఏఆర్‌ కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారం ప్రదానం చేస్తున్న సినీ దర్శకుడు వినాయక్‌, ఎమ్మెల్యే శివకుమార్‌, సినీ నటుడు రఘుబాబు తదితరులు

సినీ దర్శకుడు వినాయక్‌

నల్లూరికి ఏఆర్‌ కృష్ణ పురస్కారం ప్రదానం


తెనాలి అర్బన్‌, అక్టోబరు4: కళాకారుల ఉన్నతికి మూలం రంగస్థలమని, ఇప్పటికీ తన తల్లిదండ్రులు స్వగ్రామంలో కళా ప్రదర్శనలు ప్రోత్సహిస్తూ ఉంటారని సినీ దర్శకుడు వివి వినాయక్‌ చెప్పారు. కళల కాణాచి, వేద గంగోత్రి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఐదురోజుల పాటు కొనసాగిన జాతీయస్థాయి నాటికల పోటీల ముగింపు సభ మంగళవారం రాత్రి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. రచయిత కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతన ఈ సభ జరిగింది. సభలో రంగస్థల ప్రముఖుడు అడుసుమల్లి రాధాకృష్ణశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లుకు వినాయక్‌ చేతుల మీదుగా అందజేశారు. సభను ఉద్దేశించి వినాయక్‌ మాట్లాడుతూ, కళలకు, కళాకారులకు నిలయమైన తెనాలిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సినీ హాస్యనటుడు రఘుబాబు మాట్లాడుతూ తన సినీ అవకాశాలకు రంగస్థలమే కారణమని చెప్పారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ తెనాలికి సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకు వెళతామని, కళా ప్రముఖులందరి విగ్రహాలను తెనాలి బండ్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పురస్కార గ్రహీత నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  కళ ప్రజల కోసమని గుర్తించి ప్రజానాట్యమండలి ఏర్పాటు చేశామన్నారు. నాటకాల అకాడమీ చైర్మన్‌ హరిత, ఆర్‌.శ్రీకాంత్‌రెడ్డి, ఈదర హరిబాబు, ఎన్‌వీ శాస్త్రి, వరప్రసాదరావు, రాజేంద్రకుమార్‌, ప్రసాదరావు, గని ప్రసంగించారు. వినాయక్‌ను అభిమానులు ఘనంగా సన్మానించారు. 

ఉత్తమ నాటిక ప్రదర్శనగా ఓ క్రైం కథ

పోటీలలో ఉత్తమ ప్రదర్శనగా ఓ క్రైం కథ ఎంపికైంది.  సినీ దర్శకుడు వివి వినాయక్‌, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, సినీ హాస్యనటుడు రఘుబాబు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ఎస్‌-11, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నెట్‌ నాటికలు ఎంపికయ్యాయి. ఉత్తమ దర్శకునిగా వాసు, రంగాలంకరణ ఫణీంద్ర, ఆహార్యంలో థామస్‌, సంగీతంలో లీలామోహన్‌, రచనలో వల్లూరి శివప్రసాద్‌, హాస్యనటునిగా సీతాపతి, ప్రతినాయకునిగా శ్రీనివాసరావు, ఉత్తమ నటిగా జ్యోతి, ఉత్తమ నటునిగా నాయుడు గోపి, జ్యూరీ అవార్డులను రాజేశ్వరి, భవాని, ప్రసాద్‌, సురభి లలిత, వసంత యామిని అందుకున్నారు. కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్రా సాయిమాధవ్‌, కార్యదర్శి షేక్‌ జానీబాషా, ప్రదాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, షబీర్‌షా, హకీంజాని, వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. న్యాయ నిర్ణేతలుగా కళ్యాణి, వలి, వేణు, కేశవరావు, శివకాశీ వ్యవహరించారు. 

Updated Date - 2022-10-05T06:12:59+05:30 IST