రాజధాని అమరావతిపై కుట్రలు ఆపండి

ABN , First Publish Date - 2022-10-05T06:10:43+05:30 IST

రాజధాని అమరావతిపై పాలకులు కుట్రలు ఆపాలని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు అన్నారు.

రాజధాని అమరావతిపై కుట్రలు ఆపండి
వెంకటపాలెం శిబిరంలో బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు

 1022వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు


తుళ్లూరు, సెప్టెంబరు 3: రాజధాని అమరావతిపై పాలకులు కుట్రలు ఆపాలని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు అన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారం 1022వ రోజుకు చేరుకున్నాయి. ఈ సదర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాలు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చామన్నారు. కానీ అభివృద్ధి చేయటం చేతకాని ప్రభుత్వం వచ్చిందన్నారు. మూడు ముక్కల ఆటతో రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను అంఽధకారం చేశారన్నారు. కులం చూడం, మతం చూడం పారదర్శక పాలన అందిస్తామని చెప్పిన పాలకులు అభివృద్ధి చేయమంటే కులాలు అంటగడుతున్నారన్నారు. అంతేకాకుండా మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చకొడుతున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మహా పాదయాత్ర ఆగదన్నారు. ఇప్పటికైనా మూడు ముక్కల ఆటకు స్వస్తి చెప్పి రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించి, అభివృద్ధిని కొనసాగించాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు.  

Updated Date - 2022-10-05T06:10:43+05:30 IST