వయోవృద్ధుల సంక్షేమానికి కృషి
ABN , First Publish Date - 2022-10-02T06:10:56+05:30 IST
వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని కలెక్టర్ శివశంకర్ తెలిపారు.
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవంలో కలెక్టర్ శివశంకర్
నరసరావుపేట రూరల్, అక్టోబరు 1: వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం శనివారం కలెక్టరేట్లోని అంబేద్కర్ స్పందన హాలులో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమానికి పెన్షన్తోపాటు, ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వయోవృద్ధుల సూచనల మేరకు ప్రత్యేక ఆశ్రమం ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరి శంకరరావు మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనల మేరకు మందులు వాడుకోవాలని సూచించారు. జీవితంలో వృద్ధాప్యం శాపంగా కాకుండా సంతోషంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పరమేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, డీఆర్వో వినాయకం, సువార్త, డాక్టర్ శోభారాణి, వెంకటప్పయ్య, అరుణ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. ఓటర్ల జాబితా విధి విధానాలపై రాజకీయ పార్టీల నాయకులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పందన హాల్లో శనివారం జరిగిన సమావేశం జరిగింది. నియోజకవర్గాల వారీగా రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు వినతులను అక్టోబరు 5న రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపుతామని కలెక్టర్ తెలిపారు. అక్టోబరు 11న ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వినాయకం, ఆర్డీవోలు అద్దెయ్య, శేషిరెడ్డి, రాజకుమారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.