పంట రుణాలకోసం రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2022-10-11T06:05:24+05:30 IST
ఖరీఫ్ పంట కాలం ముగిసి రబీ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు ఇవ్వకపోవడంతో కౌలు రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు
బ్యాంకుకు తాళాలు వేసి నిరసన
కొల్లూరు, అక్టోబరు 10: ఖరీఫ్ పంట కాలం ముగిసి రబీ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు ఇవ్వకపోవడంతో కౌలు రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం మండలంలోని దోనేపూడి చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంకును ముట్టడించారు. బ్యాంకు షట్టరుకు తాళాలు వేయడంతో గంటన్నరపాటు లావాదేవీలు నిలిచిపోయాయి. కౌలు రైతుల పట్ల మొండిగా వ్యవహరిస్తున్న బ్యాంకు మేనేజర్ తీరును ఖండిస్తూ నినాదాలు చేశారు. బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నా వారినీ రైతులు ప్రతిఘటించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఇక్కడినుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. కౌలు రైతు జిల్లా సంఘం అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబందనలను పక్కన పెట్టి బ్యాంకు నిబంధనలు అమలు చేయడం దుర్మార్గమన్నారు. కౌలు రైతులు జంపాని వెంకటప్రసాద్, గొరికపూడి ప్రసాద్, టి.నాని, రాంబాబు, కొల్లూరు తాతారావు తదితరులు పాల్గొన్నారు.