ఎన్టీఆర్ పేరు మార్పు హేయం
ABN , First Publish Date - 2022-09-30T05:27:49+05:30 IST
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టాలని అనుకోవడం సరైన చర్య కాదని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు.
ప్రజలను ఏమార్చడానికే తప్పుడు నిర్ణయాలు
జగన్పై టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ధ్వజం
హెల్త్ వర్సిటీకి పేరు మార్పుపై వినుకొండలో నిరసన దీక్ష
వినుకొండ, సెప్టెంబరు 29: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టాలని అనుకోవడం సరైన చర్య కాదని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై గురువారం పట్టణంలోని శివయ్యస్థూపం సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షలో ఉన్న జీవీ మాట్లాడుతూ వర్సిటీ ఆస్తులను దోచుకోవడానికి జగన్రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. మహనీయులను గౌరవించుకునే సంస్కృతి మనదని, ఆ సంస్కృతి జగన్రెడ్డికి లేదని విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడితే ప్రస్తుతం తొలగించడానికి సీఎం జగన్కు ఏ నైతిక హక్కు ఉందని ప్రశ్నించారు. ప్రస్తుత ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలకు వైఎస్సార్ పేరు పెట్టుకోవచ్చు గదా అన్నారు. ప్రజాసమస్యలను గాలికి వదిలేసి ప్రజలను ఏమార్చడానికి జగన్ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. వైఎస్సార్ డాక్టర్ కాబట్టి వర్సిటీకి ఆయన పేరు పెడుతున్నామని వైద్యశాఖ మంత్రి రజిని అనడంలో అర్థం లేదన్నారు. ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని కోరుతూ శిబిరంలో మధ్యాహ్నం నమాజ్ సమయంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో నాయకులు పి.వి.సురేష్, షమీమ్ఖాన్, సౌదాగర్ జానీబాషా, పత్తి పూర్ణచంద్రరావు, ఆయూబ్ఖాన్, మోటమర్రి నరసింహారావు, పువ్వాడ కృష్ణ, సనిశెట్టి నరసింహారావు, గుంజి కాళింగరాజు, మన్నెం ఆదిలక్ష్మి, మంగమూరి రాధ, ఎం.చౌడమ్మ, షబ్బీర్, పులి నాగరాజు, కాళంగి శ్రీను, వెంకటాచారి, జానీ, కాశీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.