అన్నదాతలపై ప్రభుత్వం చిన్నచూపు
ABN , First Publish Date - 2022-09-14T05:24:57+05:30 IST
అన్నదాతలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని జిల్లా నల్లమడ రైతు సంఘ నాయకుడు కొల్లా రాజమోహనరావు అన్నారు.
జిల్లా నల్లమడ రైతు సంఘ నాయకులు కొల్లా రాజమోహనరావు
పెదనందిపాడు, సెప్టెంబరు13: అన్నదాతలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని జిల్లా నల్లమడ రైతు సంఘ నాయకుడు కొల్లా రాజమోహనరావు అన్నారు. గుంటూరు ఛానెల్ను పొడిగించాలని కోరుతూ మంగళవారం స్థానిక పాతబస్టాండ్ సెంటర్లో నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలలుగా ఆయా ప్రాంతాల్లో నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే చానెల్ పొడిగింపు పనులకు నిధులు కేటాయించి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విశ్రాంత అడిషనల్ ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ దీక్షకు మద్దతు తెలిపారు. గ్రామస్థులు, పలు ప్రజా సంఘాలు, విద్యార్థులు దీక్షకు సంఘీభావంగా గ్రామంలో ప్రదర్శన చేసి తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్ళి వినతిపత్రం అందజేశారు. ఈ దీక్షకు సీపీఎం, తెలుగుదేశం, సీఐటీయూ, పలు సంఘాలు పాల్గొని సంఘీభావం తెలిపారు. నల్లమడ రైతు సంఘ నాయకులు యార్లగడ్డ అంకమ్మచౌదరి, కుర్రా హరిబాబు, బండి నాగేశ్వరరావు, ముద్దన రాఘవయ్య, కొల్లా రామన్, పలు సంఘాల నాయకులు మోపర్తి చెంచయ్య, జంపని రామారావు, ఈదర బ్రమరాంబ, కొల్లా చిట్టెమ్మ, చుండూరు రత్తాయమ్మ, చాగంటి రామతీర్థం, సుబ్బారావు, కోటేశ్వరరావు, కొలకలూరి బాబు, సాయిప్రసాదు తదితరులు పాల్గొన్నారు.